21న రాష్ట్రపతితో చంద్రబాబు, రాహుల్ భేటీ..! ఫలితాల ముందు ఉత్కంఠ రేపుతున్న సమావేశం..!!
విజయవాడ/హైదరాబాద్ : ఫలితాల ముహూర్తం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ నేతల్లో ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీ ల నేతల వరకు ఎవరి జాగ్రత్తలో వారు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంతో జాతీయ స్థాయిలో ఏ పార్టీకి సరైన మెజారిటి రాని పక్షంలో అనుసరించాల్సిన వ్యూహం పై ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ, టీడిపి జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
యూపీయే ఛైర్మన్గా చంద్రబాబు..? ప్రతిపాదిస్తున్న బీజేపీఏతర నేతలు..!!
జాతీయ పార్టీలకు ఆధిక్యత రాని పక్షంలో యూపీఏ-3 ని గుర్తించాల్సిందిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరనున్నారు. ఈనెల 21వ తేదీన రాష్ట్రపతిని కలిసేందుకు చంద్రబాబు నాయుడుకు అప్పాయింట్ మెంట్ లభించింది.
ఓట్ల లెక్కింపునకు సరిగ్గా రెండు రోజులు ముందు రాష్ట్రపతి కోవింద్ ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా.. పలు విపక్ష పార్టీ అధినేతలు భేటీ కానున్నారు. ఫలితాల వెల్లడికి రెండు రోజుల ముందు విపక్ష పార్టీలు రాష్ట్రపతిని కలవటానికి ముందు జాగ్రత్తలో భాగంగా భావిస్తున్నారు. యూపీఏ కూటమి ఎన్నికలకు ముందే మొగ్గతొడిగిందని, తామంతా కలిసి కూటమిగా పోటీ చేశామని తెలియచేయనున్నారు. ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన అధిక్యత రాని పక్షంలో తమ కూటమిని గుర్తించాల్సిన అవసరాన్ని వారు చెప్పనున్నట్లు చెబుతున్నారు.
ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరికి సరైన బలం రాని వేళలో ఏదైనా జరిగే అవకాశం ఉందని విపక్షాలు భావిస్తున్నాయి. ఈ పరిస్థితులు ఎదురైతే మోడీకి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్న ఆలోచనలో విపక్షాలు ఉన్నాయి. ఈ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఎన్నికలకు ముందే కుదిరిన కూటమిగా రాష్ట్రపతి దృష్టికి తీసుకురావడం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.