హస్తినలో బాబు బిజీ బిజీ .. శనివారం రాహుల్, మాయాతో భేటీ
న్యూఢిల్లీ : హస్తిన పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా ఉన్నారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్తో ప్రారంభమైన షెడ్యూల్ శనివారం మాయావతితో సమావేశంతో ముగియనుంది. చంద్రగిరి రీ పోలింగ్ అంశంపై సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. తర్వాత ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో సమావేశమయ్యారు.
కేజ్రీతో డిస్కస్ ..
ఈ సందర్భంగా కేజ్రీవాల్- చంద్రబాబు మధ్య తాజా రాజకీయాలపై చర్చ జరిగింది. దాదాపు అరగంటపాటు వివిధ అంశాలపై డిస్కస్ చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలు .. బెంగాల్లో ర్యాలీ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తత .. దీదీకి మద్దతు సమావేశంలో ప్రధానంగా చర్చ వచ్చినట్టు తెలిసింది. ప్రధాని మోదీ, అమిత్ షా ఎన్నికల సంఘాన్ని నియంత్రిస్తున్నారని వారు బాహాటంగానే ఆరోపిస్తున్నారు.
రాహుల్తో భేటీ
మొదటి రోజు పర్యటన ముగియగా .. శనివారం కూడా వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమవనున్నారు. ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీతో చంద్రబాబు సమావేశమవుతారు. ఈ సందర్భంగా బెంగాల్ ఇష్యూ డిస్కస్ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతోపాటు ఏపీలో రీ పోలింగ్ గురించి రాహుల్ మద్దతు కూడగట్టే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు 23న ఉన్న నేపథ్యంలో సీట్లలో విజయం ... కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు గురించి రాహుల్ తో చంద్రబాబు చర్చిస్తారు.
మాయావతితో కూడా ...
రాహుల్తో భేటీ తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా చంద్రబాబు భేటీ అవుతారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితులపై డిస్కస్ చేస్తారని తెలుస్తోంది. ఓ వైపు కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ కోసం ప్రాంతీయ పార్టీ నేతలతో సమావేశమవుతుంటే .. చంద్రబాబు కూడా మిగతా నేతలను కలుస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాహుల్తో దగ్గరగా ఉంటూనే ... మరోవైపు ప్రధాని అభ్యర్థి అని చెప్పుకుంటున్న మాయావతితో కూడా భేటీ కావడం చర్చకు దారితీస్తోంది. ఇంతకీ బాబు ఏ అజెండాతో ముందుకెళ్తున్నారో అంతుబట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే బాబు మదిలో ఏముంది ? వరుసగా నేతల భేటీకి గల కారణమేంటో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.