జైట్లీ అంత్యక్రియల్లో దొంగల చేతివాటం: 11 ఫోన్ల చోరీ, కేంద్రమంత్రులు కూడా బాధితులే
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియల్లో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. అనారోగ్యంతో బాధపడుతూ గత శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడవగా.. జైట్లీ పార్థీవ దేహానికి ఆదివారం నిగంబోధ్ ఘాట్ వద్ద అంత్యక్రియలు నిర్వహించారు.
ఎక్కువ రద్దీ ఉండటంతో..
జైట్లీ అంత్యక్రియలకు అన్ని పార్టీల నేతలు, రాజకీయ, సినీ ప్రముఖులు వచ్చి నివాళులర్పించారు. ఈ సందర్భంలో కొందరు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించి మొబైల్ ఫోన్లను అపహరించారు. ఎక్కువగా రద్దీ ఉండటంతో దొంగలు తమ పనిని సులభంగా చేసుకున్నారు.
కేంద్రమంత్రులూ బాధితులే..
మొత్తం 11మంది వద్ద దొంగలు మొబైల్ ఫోన్లను దొంగిలించారు. బాధితుల్లోకేంద్రమంత్రులు బాబుల్ సుప్రియో, సోమ్ ప్రకాశ్, సుప్రియో సెక్రటరీ, పతంజలి అధికార ప్రతినిధి ఎస్కే తిజరవాలా కూడా ఉన్నారు. తమ విలువైన ఫోన్లు చోరీకి గురికావడంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. ఫోన్లలో విలువైన సమాచారం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
11మంది ఫోన్లు చోరీ..
మిగితా 10మందితోపాటు తిజరవాలా సోమవారం ట్విట్టర్ ద్వారా తమ ఫోన్ చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేత, అసన్సోల్ ఎంపీ బాబుల్ సుప్రీయో ఫోన్ కూడా చోరీకి గురైందని తెలిపారు. ఢిల్లీ పోలీసులతోపాటు హోంమంత్రి అమిత్ షాను కూడా ట్యాగ్ చేశారు తిజరవాలా.
నివాళుర్పించే చోట ఇలానా?
జైట్లీ పార్థీవదేహానికి చివరిసారిగా నివాళులర్పించేందుకు వచ్చిన సమయంలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించి పలువురు ఫోన్లను అపహరించారని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. నివాళులర్పించే సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం విచారకరమని తిజరవాలా అని వ్యాఖ్యానించారు. అంతేగాక, ప్రస్తుత తన ఫోన్ లొకేషన్ కూడా తిజరవాలా షేర్ చేశారు. ఇప్పటి వరకు తమకు ఐదుగురి నుంచి ఫోన్ల చోరీపై ఫిర్యాదులు అందాయని, వారిలో సుప్రియో కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు.