కాంగ్రెస్కు మద్దతు కోసం అఖిలేష్, మాయావతిలకు చంద్రబాబు బుజ్జగింపులు!
Recommended Video
న్యూఢిల్లీ: ఈ నెల 23వ తేదీన ఫలితాలు వెల్లడైన తరువాత జాతీయ స్థాయిలో ఏర్పడే రాజకీయ పరిణామాలపై అందరి దృష్టీ నిలిచింది. హంగ్ అంటూ ఏర్పడితే ఏ కూటమి కేంద్రంలో అధికారాన్ని నెలకొల్పుతుందనే అంశంపై ఉత్కంఠత నెలకొంది. ఈ నేపథ్యంలో- కాంగ్రెస్కు దూరంగా ఉంటోన్న రాజకీయ పార్టీలతో చంద్రబాబు మంతనాలు సాగిస్తున్నారు. రాయబారాన్ని నెరపుతున్నారు. కాంగ్రెస్ అంటే గిట్టని పార్టీలను ఏకతాటిపైకి తీసుకుని వచ్చే బాధ్యతను చంద్రబాబు తన భుజాలకు ఎత్తుకున్నారు. బీజేపీయేతర పార్టీలన్నింటినీ కాంగ్రెస్ గొడుగు కిందికి తీసుకుని రావడానికి మధ్యవర్తిత్వాన్ని నిర్వహిస్తున్నారు.
నేటి ఎగ్జిట్పోల్స్ వైసీపీకే అనుకూలం: 23న మనం ఎలా గెలుస్తామంటే..: ఇదీ చంద్రబాబు లెక్క..!
మాయావతి-అఖిలేష్-రాహుల్: ఇదీ చంద్రబాబు ప్రయాణం
ఇందులో భాగంగా- ఆదివారం ఉదయం నుంచీ ఆయన తీరిక లేకుండా గడుపుతున్నారు. కాంగ్రెస్ అంటే ఒంటికాలిపై లేచే సమాజ్వాది పార్టీ, బహుజన్ సమాజ్వాది పార్టీలతో చంద్రబాబు నిరంతరాయంగా సంప్రదింపులు నిర్వహిస్తున్నారు. సమాజ్వాది పార్టీ చీఫ్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలతో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను ఆయన రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావిస్తున్నారు. రాహుల్ గాంధీ పెట్టిన ప్రతిపాదనలను అఖిలేష్ యాదవ్కు, అఖిలేష్ యాదవ్ డిమాండ్లను రాహుల్ గాంధీకి వివరిస్తున్నారు.
అఖిలేష్కు బుజ్జగింపులు
ఇందులో భాగంగా- ఈ ఉదయం లక్నోలో అఖిలేష్ యాదవ్తో భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడు. తాము ఎన్డీఏ కూటమిలో చేరాలని అనుకోవట్లేదని ఆయన ఈ సందర్భంగా చంద్రబాబు ముఖం మీదే చెప్పేశారట. అయినప్పటికీ.. చంద్రబాబు పట్టువదలని విక్రమార్కుడిలాగా అఖిలేష్తో భేటీని కొనసాగించారు. రాజకీయాల్లో పట్టు విడుపులు ఉండాలని, శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు అంటూ ఉండరని చంద్రబాబు ఆయనను బుజ్జగించినట్లు చెబుతున్నారు. యూపీఏలో చేరడానికి అవసరమైన డిమాండ్లను తనకు అందజేస్తే.. తాను రాహుల్ గాంధీని సంప్రదిస్తానని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫలితంగా- అఖిలేష్ యాదవ్ కొన్ని కీలకమైన డిమాండ్లను చంద్రబాబు ముందు ఉంచారని అంటున్నారు.
డిమాండ్ల చిట్టాతో రాహుల్ను మరోసారి భేటీ..
ఈ డిమాండ్ల చిట్టాను పట్టుకుని చంద్రబాబు నాయుడు లక్నో నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సాయంత్రం ఆయన మరోసారి రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. అఖిలేష్ యాదవ్ పెట్టిన డిమాండ్ల జాబితాను రాహుల్ గాంధీకి వివరిస్తారు. వాటన్నింటికి తల ఊపేలా రాహుల్ గాంధీని ఒప్పించే బాధ్యతను చంద్రబాబు స్వీకరించినట్లు చెబుతున్నారు.
యూపీ కీలకం..
ఉత్తర్ ప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మెజారిటీ స్థానాలను దక్కించుకున్న వారికి కేంద్రంలో అధికారాన్ని అందుకోవడం అత్యంత సులభం. 2014 ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ తన మిత్రులను కూడా కలుపుకొని మొత్తం 73 స్థానాలను కైవసం చేసుకోగలిగింది. ఒక్క రాష్ట్రం నుంచే ఇన్ని సీట్లు రావడం అంటే మాటలు కాదు. దీనితో బీజేపీ కేంద్రంలో సునాయాసంగా, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈ సారి ఆ పరిస్థితులు కనిపించట్లేదు. ఎందుకంటే- మొన్నటిదాకా కత్తులు దూసుకున్న ఎస్పీ-బీఎస్పీ జట్టు కట్టాయి. ఉమ్మడి శతృవును ఎదుర్కొనడానికి ఏకం అయ్యాయి. ఫలితంగా- బీజేపీకి ఎదురుగాలి వీస్తోందంటూ వార్తలు వస్తున్నాయి.
దగ్గరికి చేర్చగలుగుతారా?
ఎస్పీ-బీఎస్పీ-రాష్ట్రీయ జనతాదళ్లతో కూడి మహాకూటమి మెజారిటీ స్థానాలను గనక దక్కించుకుంటే- కాంగ్రెస్కు ప్రాణవాయువును అందించగలదు. తమ కష్టాన్ని బేషరతుగా కాంగ్రెస్ చేతుల్లో పెట్టడానికి మాయావతి గానీ, అఖిలేష్ యాదవ్ గానీ సుముఖంగా లేరు. ప్రస్తుతానికి వారు ఏమీ పట్టనట్టే ఉంటున్నారు. దీనితో- కొత్త మిత్రుడు చంద్రబాబును బరిలో దింపారు రాహుల్ గాంధీ. అఖిలేష్ యాదవ్, మాయావతిలతో దశలవారీగా చర్చలు జరిపి, వారిని ఒప్పించాలని ఆయన చంద్రబాబును సూచించారు. దీనితో వెనుకా- ముందూ ఆలోచించకుండా దూకేశారు చంద్రబాబు. కాంగ్రెస్ అంటే విముఖంగా ఉన్న పార్టీలన్నింటినీ హస్తం పార్టీ గొడుగు కిందికి తీసుకుని రావడానికి తన 40 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని వినియోగిస్తున్నారు.