వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు బ్యాకప్ ట్రైన్లలో బెర్తులు
హైదరాబాద్: మీరు బుక్ చేసుకొన్న రైలు టికెట్ వెయిటింగ్ లిస్ట్లోనే ఉందా? అయితే మీకొ శుభవార్త. వెయిటింగ్ లిస్ట్ టికెట్ను రద్దు చేసుకునే అవకాశం లేకుండా, అదే టికెట్పై మరో రైలులో ప్రయాణం చేసే సదుపాయాన్ని భారతీయ రైల్వేలు అందించనున్నాయి.
ఈ విషయంపై రైల్వే బోర్డు అదనపు డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్ సక్సేనా బుధవారం విలేకరులతో మాట్లాడుతూ 'బ్యాకప్ ట్రైన్ల'లో ప్రయాణికులకు బెర్తులిస్తామని చెప్పారు. వెయిటింగ్ లిస్ట్లోని ప్రయాణికులకు ఆ తర్వాత బయల్దేరే రైళ్లలో ఖాళీలను బట్టి సీట్లిస్తామని, ఈ ప్రతిపాదనలు ప్రారంభ దశలో ఉన్నాయని ఆయన వెల్లడించారు.
ప్రయాణికుల సంఖ్యను బట్టి అవసరమైనతే ఆ తర్వాత బయల్దేరే రైళ్లలో అదనపు బోగీలు వేస్తామని తెలిపారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందించే భాగంలో ఇటీవలే ఇండియన్ రైల్వే, ఎయిర్ ఇండియాతో డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ స్కీములో దాదాపు 100 టికెట్ల వరకూ అప్గ్రేడ్ చేసినట్టు రైల్వే శాఖ వెల్లడించింది.
కాగా, జూన్ 21న రైళ్లు రద్దయిన సమాచారాన్ని ప్రయాణికుల ఫోన్లకు నేరుగా ఎస్ఎంఎస్ సేవలను రైల్వే శాఖ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టుగా రైలు ప్రారంభ స్టేషన్లో టికెట్లు రిజర్వ్ చేసుకున్న వారికి ఈ సేవలు అందిస్తామని, తర్వాతి దశలో రద్దయిన రైలుకు సంబంధించి ఎన్ని స్టేషన్లలో ఎంతమంది ప్రయాణికులు రిజర్వ్ చేసుకున్నారో వారందరికీ పంపుతామని పేర్కొంది.
ఆన్లైన్, నేరుగా రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులు ఇచ్చే మొబైల్ నంబర్కు ఈ ఎస్ఎంఎస్లు వెళ్తాయని, తప్పనిసరి పరిస్థితుల్లో రైలును రద్దు చేసినప్పుడు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు ఈ ఎస్ఎంఎస్లు ఉపయోగపడతాయని వివరించింది. కేంద్ర రైల్వే సమాచార వ్యవస్థ, రైల్వే శాస్త్ర సాంకేతిక విభాగం ఈ సాఫ్ట్వేర్ను రూపొందించింది.