కాలుష్యం ఎఫెక్ట్: దేవీదేవతలూ మాస్కులు ధరించారు! ఎక్కడంటే..?
వారణాసి: దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర వాయు కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రభావం దేవుళ్లపైనా పడింది. వారణాసిలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండటంతో దేవుళ్ల విగ్రహాలకు కూడా మాస్కులు పెట్టడం గమనార్హం.
మనుషులే కాదు..
దేవుడిని వాయు కాలుష్యం నుంచి రక్షించాలనే ఉద్దేశంతోనే తామము దేవుళ్ల విగ్రహాలకు మాస్కులను పెడుతున్నామని భక్తులు చెబుతున్నారు. దీపావళి తర్వాత ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్లోనూ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. వారణాసిలో ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటికి రావడం లేదు. బయటికి వచ్చినా ముఖాలకు మాస్కులు ధరిస్తున్నారు. ఇప్పుడు దేవుడి విగ్రహాలకు కూడా మాస్కులు ధరింపజేయడం చర్చనీయాంశంగా మారింది.
దేవీదేవతలూ మాస్కులు ధరించారు..
వారణాసిలోని సిగర్ పరిధిలోని కాశీ విద్యాలయం సమీపంలోని శివపార్వతి మందిరంలోని విగ్రహాలకు అక్కడి పూజారి, భక్తులు మాస్కులను ధరింపజేశారు. శివుడు, దుర్గా, కాళీ, సాయిబాబా విగ్రహాలకు కూడా మాస్కులు ధరింపజేశారు. కాగా, దీపావళి అనంతరం వారణాసిలో కాలుష్యం 500 పాయింట్లు దాటింది. దాదాపు ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది.
మానవ రూపంలోనే..
ఇక్కడి వారంతా దేవుడిని మానవ రూపంలో కొలుస్తారని, అందుకే వేసవిలో వేడి నుంచి కాపాడటానికి విగ్రహాలకు చందనం రాస్తామని చెప్పారు హరీశ్ మిశ్రా అనే పూజారి తెలిపారు. అంతేగాక, చలి నుంచి రక్షించడానికి కంబళ్లు, స్వెట్టర్లు వేస్తామని, ఇప్పుడు కాలుష్యం ఎక్కువగా ఉండటంతో మాస్కులు వేశామని చెప్పుకొచ్చారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి అందరూ కలిసి ముందుకు వస్తేనే ఫలితం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వారణాసి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికైన విషయం తెలిసిందే.
కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ప్రధాని కీలక సమీక్ష
దేశ రాజధానితోపాటు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో అత్యంత ప్రమాకర స్థాయికి చేరిన వాయు కాలుష్యంపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. వాయు కాలుష్యంపై మోడీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు పీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది.ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రాతోపాటు ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యంతోపాటు గుజరాత్ సహా పశ్చిమ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తుఫానుల వల్ల తలెత్తే పరిస్థితులపైనా సమీక్షించినట్లు ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వాయు కాలుష్యంపై సోమవారం జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుకు పలు సూచనలు చేసింది. ఢిల్లీలో అత్యయిక పరిస్థితుల కన్నా అధ్వాన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని, ఢిల్లీ ప్రజలు స్వచ్ఛమైన గాలిని కూడా పీల్చుకోలేని పరిస్థితులో ఉన్నారని పేర్కొంది. కాలుష్యానికి ప్రధాన కారణమైన పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో పంటల వ్యర్థాలను తగలబెట్టడం ఆపాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఇదివరకు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.