2234మందికి హెచ్ఐవి : చిన్న పొరపాటు.. భారీ మూల్యం..
న్యూఢిల్లీ : ఒక్క పొరపాటు వేలమంది జీవితాలను బలి తీసుకుంది. సరైన సమయంలో పేషెంట్ కి రక్తం ఎక్కించడం ఎంత అవసరమో.. ఆ రక్తం ఎంతమేర స్వచ్చమైందో పరీక్షించడం కూడా అంతే అవసరం. లేదంటే ప్రాణాలు దక్కినా.. జీవితాంతం రోగాలతో కాలం వెళ్లదీయాల్సిందే. అదే హెచ్ఐవి బారినపడితే జీవితానికి ఇక ఫుల్ స్టాప్ పడ్డట్టే.
అత్యవసర సమయాల్లో చాలామంది డాక్టర్లు రక్తాన్ని పరీక్షించకుండానే రోగులకు ఎక్కిస్తున్నందువల్ల ఏటా చాలామంది హెచ్ఐవి బారిన పడుతున్నారు. సమాచార హక్కు (చట్టం) ఆర్టీఐ ద్వారా వెలుగుచూసిన ఈ గణాంకాలను చూస్తే.. రక్త మార్పిడి అంటేనే భయపడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. రక్తమార్పిడుల వలన దేశంలో ఏటా 2234మంది హెచ్ఐవి బారిన పడుతున్నట్టుగా ఆర్టీఐ లెక్కలు చెప్తున్నాయి.
చేతన్ కొఠారీ అనే వ్యక్తి చేసిన దరఖాస్తుతో ఈ విస్మయం కలిగించే విషయాలు బయటపడ్డాయి. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ లెక్కల ప్రకారం గడిచిన 17 నెలల కాలంలో ఆయా బ్లడ్ బ్యాంకులు 30 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించగా.. ఆ రక్తాన్ని సరిగా పరీక్షించకపోవడం వల్ల 2వేల పైచిలుకు జనానికి హెచ్ఐవి సోకింది.
ఇందులో ఎక్కువభాగం కేసులు ఉత్తరప్రదేశ్ లో నమోదయ్యాయి. యూపీలో 361 మందికి రక్త మార్పిడుల వల్ల హెచ్ఐవి సోకితే, గుజరాత్ లో 292 మందికి సోకింది. హెచ్ఐవి సోకినవారికి 3 నెలల వరకు రక్త పరీక్షల్లో వ్యాధి బయటపడకపోవడం, పేషెంట్లకు రక్తం ఎక్కించేప్పుడు తప్పనిసరిగా చేయాల్సిన హెచ్బీవీ, హెపటైటిస్ సి, మలేరియా, సిఫిలిస్ లాంటి టెస్టులు చేయకపోవడం వలన చాలామంది రక్తగ్రహీతలు రోగాల బారిన పడుతున్నారు.