యూపీ గ్యాంగ్ రేప్: సాయంత్రం ఒంటరిగా బయటకు వెళ్లాల్సింది కాదు.. మహిళా కమిషన్ సభ్యురాలి సంచలన వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్లోని బదౌని జిల్లాలో 50 ఏళ్ల అంగన్వాడీ కార్యకర్త గ్యాంగ్ రేప్కి గురైన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు చంద్రముఖి దేవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయంత్రం పూట ఆమె ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లకపోయి ఉంటే ఈ ఘటనే జరిగి ఉండకపోవునేమో అన్నారు. లేదా తోడుగా కుటుంబ సభ్యులను ఎవరినైనా తీసుకెళ్లి ఉంటే ఇలా జరిగేది కాదేమో అన్నారు. గురువారం(జనవరి 7) బదౌని జిల్లాలోని ఉఘాటి గ్రామంలో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా చంద్రముఖి దేవీ ఈ వ్యాఖ్యలు చేశారు.
షాకింగ్ : ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్.. జననాంగాలు చిధ్రం.. పూజారిపైనే అనుమానం
చంద్రముఖీ దేవీ ఏమన్నారు...
ఉఘాటిలో అంగన్వాడీ కార్యకర్త గ్యాంగ్ రేప్ ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు జాతీయ మహిళా కమిషన్ గురువారం ఇద్దరు సభ్యులను ఢిల్లీ నుంచి అక్కడికి పంపించింది. ఈ ఇద్దరు సభ్యులు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మహిళా కమిషన్ సభ్యురాలైన చంద్రముఖి దేవీ మాట్లాడుతూ... 'సాయంత్రం సమయంలో ఒక మహిళ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకూడదు. ఆ సాయంత్రం ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లకపోయి ఉండాల్సింది. లేదా తోడుగా కుటుంబ సభ్యులను ఎవరినైనా తీసుకెళ్లినా ఇలా జరగకపోయేదేమో..' అని అభిప్రాయపడ్డారు.
పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని...
ఈ ఘటనపై చర్యల విషయంలో పోలీసులు సరిగా వ్యవహరించలేదని దేవి అన్నారు. పోలీసులు తక్షణం స్పందించి ఉంటే బాధితురాలి ప్రాణాలు దక్కి ఉండేవన్నారు.బాధితురాలిని అపస్మారక స్థితిలో ఉండగా గుర్తించారని.. ఆమెకు చికిత్స అందించి ఉంటే ప్రాణాలు దక్కేవని సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ అధికారి చెప్పారన్నారు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. పోస్టుమార్టమ్ కూడా చాలా ఆలస్యంగా చేశారని చెప్పారు. పోస్టుమార్టమ్ రిపోర్టులో వెల్లడించిన విషయాలు ఈ ఘటన అత్యంత పాశవికంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నాయన్నారు.
ఫోన్ చేసి ఆలయానికి పిలిపించి...
మరో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు మాట్లాడుతూ... ఇది అత్యంత ఘోరమైన ఘటన అని,నిందితులకు కఠిన శిక్షలు పడాలని అన్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి సంఘటనలను ఉపేక్షించదన్నారు. బాధితురాలు అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోందన్నారు. నిందితులు పక్కా ప్లాన్ ప్రకారమే ఆమెకు ఫోన్ చేసి ఆలయానికి పిలిపించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని అన్నారు. కేవలం స్టేషన్ హౌస్ ఆఫీసర్ను సస్పెండ్ చేయడం కాదని... ఇందులో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని అన్నారు.
పోస్టుమార్టమ్ రిపోర్టుపై ఎస్ఎస్పీ...
సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ సంకల్ప్ శర్మ మాట్లాడుతూ.. పోస్టుమార్టమ్ రిపోర్టులో ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలిందన్నారు. ఆమె కాలును విరిచేయడంతో పాటు ఆమె జననాంగాలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు తేలిందన్నారు. ఈ ఘటనపై చర్యల విషయంలో అలసత్వం వహించిన ఉఘాటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ ఉత్తరప్రదేశ్ డీజీపీకి లేఖ రాసి... ఉఘాటి గ్యాంగ్ రేప్ ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
మా వాడు అమాయకుడు.. : పూజారి కుటుంబం
ఉఘాటిలోని స్థానిక ఆలయ పూజారి,అతని శిష్యులు ఈ అత్యాచారానికి పాల్పడినట్లుగా బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే ఆ ముగ్గురిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాధితురాలు బావిలో పడటంతో గాయాలపాలైందని సదరు పూజారి,అతని శిష్యులతో కలిసి ఆమెను కారులో తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు స్థానికులు చెప్తున్నారు. కానీ ఆమె జననాంగాలపై ఉన్న గాయాలు ఆమెపై అత్యాచారం జరిగిందన్న విషయాన్ని ధ్రువీకరించాయి. దీంతో పూజారే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు ప్రధాన నిందితుడైన పూజారి జష్పాల్ కుటుంబ సభ్యులు మాత్రం అతను అమాయకుడని,అతనికేమీ తెలియదని చెబుతున్నారు.