బ్రేకింగ్: బీజేపీలోకి బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం..
Recommended Video
భారత బ్యాడ్మింటన్ స్టార్, హైదరాబాదీ సైనా నెహ్వాల్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆరంభించారు. బుధవారం ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ చీఫ్ జేపీ నడ్డా.. సైనాకు కాషాయ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెతో ప్రచారం చేయిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
చాలా గర్వంగా ఉంది..
పార్టీలో చేరిక తర్వాత బీజేపీ కార్యాలయంలో సైనా నెహ్వాల్ మీడియాతో మాట్లాడారు. దేశం కోసం ఎన్నో మంచిపనులు చేస్తోన్న బీజేపీ గొప్ప పార్టీఅని, ఆ కుటుంబంలో సభ్యురాలినైననందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీలాంటి విశిష్టవ్యక్తితో కలిసి పనిచేసే అవకాశం లభించడం వరంలాంటిదన్నారు. దేశానికి మరింత మంచి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
షాతో మీటింగ్ తర్వాత..
గతేడాది లోక్ సభ ఎన్నికల టైమ్ లో అప్పటి బీజేపీ చీఫ్ అమిత్ షాతో మీటింగే సైనా పొలిటికల్ ఎంట్రీకి దారితీసినట్లు తెలిసింది. ‘సంపర్క్ సే సమర్థన్' కార్యక్రమంలో భాగంగా అమిత్ షా గతేడాది హైదరాబాద్ వచ్చి సైనా కుటుంబాన్ని కలుసుకున్నారు. షాతో గంటసేపు మాట్లాడిన తర్వాత బీజేపీ ఎంత గొప్ప విజన్ ఉన్న పార్టీనో అర్థమైందని బ్యాడ్మింటన్ స్టార్ చెప్పారు. ఆ మీటింగ్ లో తెలంగాణకు చెందిన బీజేపీ కీలక నేతలు కూడా భాగం పంచుకున్నారు.
స్పోర్ట్స్ స్టార్లకు పెద్దపీట..
నాయకత్వ లోపం పార్టీకి పెద్ద సవాలుగా మారిందని బీజేపీ అధిష్టానం గతంలో చాలా సార్లు వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్ల ద్వారా దాన్ని భర్తి చేయాలని భావించారు. ఈ క్రమంలోనే రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మొదలు గౌతం గంభీర్, బబితా ఫొగట్ తదితరులకు టికెట్లిచ్చి ప్రోత్సహించారు. ఇప్పుడు సైనా వంతు.
టార్గెట్ తెలంగాణ..
ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిలో ఒక్క కర్నాటక తప్ప మిగతా రాష్ట్రాల్లో వెనుకబడిఉన్న పదునైన వ్యూహాలతో పార్టీ విస్తరణకు ప్రయత్నిస్తోంది. తెలంగాణలో నాలుగు లోక్ సభ సీట్లు సాధించిన తర్వాత ఫోకస్ మరింత పెంచారు కమలనాథులు. అందులో భాగంగానే సైనాను పార్టీలోకి చేర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న సైనా సేవల్ని తెలంగాణ వరకే పరిమితం చేయకుండా అన్ని రాష్ట్రాల్లో వాడుకోవాలని హైకామాండ్ భావిస్తున్నట్లు తెలిసింది. ఢిల్లీ ఎన్నికల్లో సైనాతో ప్రచారం నిర్వహించబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కెరీర్ ముగిసినట్లేనా?
ఒలంపిక్స్, కామన్ వెల్త్ తోపాటు ఎన్నెన్నో అంతర్జాతీయ, జాతీయ టోర్నమెంట్లలో సత్తాచాటుకున్న సైనా నెహ్వాల్.. మోస్ట్ సక్సెస్ఫుల్ అథ్లెట్లలో ఒకరిగా పేరుతెచ్చుకున్నారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో నంబర్1 ర్యాంకును కైవసం చేసుకున్న తొలి భారతీయురాలిగానూ రికార్డులకెక్కారు. 2009 నుంచి 2015 దాకా నంబర్ 2 ర్యాంకులో కొనసాగారు. సైనా ఖాతాలో 24 అంతర్జాతీయ టైళ్లున్నాయి. 29 ఏళ్ల సైనా.. ప్రస్తుతం ప్రపంచ 9వ ర్యాంకులో కొనసాగుతున్నారు. కొంతకాలంగా చెప్పుకోదగ్గ విజయాలేవి ఖాతాలో లేకపోవడంతో కెరీర్ ముగిసినట్లేనన్న ప్రచారం జరుగుతోంది. అంతలోనే అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఆమె రాజకీయ అరంగేట్రం చేశారు.