తెరుచుకున్న బద్రీనాథుడు..!శాస్త్రోక్తంగా వేద మంత్రాలు..!సాధారణ పరిస్ధితులు వచ్చినట్టేనా..?
ఉత్తరఖండ్/హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి మానవాళి మీదనే కాకుండా దేవుళ్ల మీద కూడా ప్రభావం చూపుతోంది. కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు గత 56రోజులుగా మూసిఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఇప్పుడిప్పుడే తెరుచుకునేందుకు తయారవుతున్నాయి. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా మార్చి నెల ఇరవై నాలుగునిండి అన్ని ఆలయాలను కూడా మూసివేశారు అధికారులు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్డౌన్ ఈ నెల 17తో ముగియనుంది.
ఆ మర్నాటి నుంచే లాక్డౌన్ ఆంక్షలను కొనసాగిస్తారా, సడలిస్తారా అనేది ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉండగా దేశంలోని ప్రముఖ పుణ్య క్షేత్రంలో నేటి నుంచి భక్తులకు దర్శనాలు కల్పించారు. ఉత్తరఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం శుక్రవారం తెరుచుకుంది. చాలా రోజుల తర్వాత అక్కడ కనిపిస్తున్న ఆద్యత్మిక వాతావరణానికి భక్తులు పులకించిపోతున్నట్టు తెలుస్తోంది.
అంతే కాకుండా అలకనందా నది ఒడ్డున నార్, నారాయణ్ పర్వతాల మధ్య ఉన్న బద్రీనాథ్ ఆలయం ప్రసిద్ధి చెందిన సుందర ప్రదేశంగా పేరుగాంచిన ఈ దేవాలయంలో తెల్లవారు ఝామున ప్రధాన ధ్వారలు తీశారు నిర్వాహకులు. అంతకు ముందు పూజారులు శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు. వస్త్రాలంకరణ కార్యక్రమంలో లాక్డౌన్ ఆంక్షల కారణంగా ఆలయ ప్రధాన పూజరితో సహా కేవలం 28 మంది మాత్రమే హాజరయ్యారు.
ఆలయం చుట్టూ రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. గత ఏడాది ఆలయం తెరిచిన మొదటి రోజు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాగా, ఈ సారి మాత్రం లాక్డౌన్ కారణంగా ఆ అవకాశం లేదు. ఉత్తరఖండ్ సీఎం త్రీవేంద్రసింగ్ రావత్, గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.