భార్య శవాన్ని 10కి.మీ మోసిన భర్తకు రూ.9లక్షల బహ్రెయిన్ రాజు చెక్కు
భువనేశ్వర్: ఆర్థిక స్తోమత లేక భార్య ప్రాణాలు పోగొట్టుకుని, అంబులెన్స్ సదుపాయం లేకపోవడంతో ఆమె మృతదేహాన్ని భుజాన మోసుకెళ్లిన ఒడిశా వ్యక్తి దానా మాఝీకి బహ్రెయిన్ రాజు నుంచి ఆర్థిక సాయం అందింది. ఆ నాటి ఘటన గురించి మీడియా ద్వారా తెలుసుకున్న బహ్రెయిన్ రాజు ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా అతడికి అండగా ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు ఖలీఫా పంపిన రూ. 8.87లక్షల చెక్కును ఢిల్లీలోని బహ్రెయిన్ ఎంబసీ ద్వారా దానాకు అందజేశారు. సామాజిక కార్యకర్త, కేఐఎస్ఎస్ వ్యవస్థాపకుడు అచ్యుత సమంత సహకారంతో ఢిల్లీ వెళ్లి దానా తన చెక్కును తీసుకున్నాడు.
ఈ సందర్భంగా దానా మాట్లాడుతూ.. ఈ డబ్బును బ్యాంకులో వేసి తన ముగ్గురు కుమార్తెల చదువుకు ఉపయోగిస్తానని చెప్పాడు. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా దానాకు ఆర్థికసాయం అందించాయి. ఆగస్టులో ఒడిశాలోని కలహండి జిల్లాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం స్రుష్టించిన విషయం తెలిసిందే.
అంబులెన్స్ సదుపాయం అందుబాటులో లేకపోవడం, వేరే వాహనంలో తరలించేందుకు డబ్బులు లేకపోవడంతో దానా మాఝీ.. అనారోగ్యంతో మృతిచెందిన తన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాడు. అన్ని మీడయాల్లో ఫొటోతో సహా ప్రచురితమైన ఈ వార్త బహ్రెయిన్ రాజు దృష్టిలో పడటంతో ఆయన కదిలిపోయారు. అప్పుడే ఆర్థిక చేస్తానంటూ ప్రకటించి తన మాట నిలబెట్టుకున్నారు.