పెషావర్ టైంలోనే.. భారత్కు షాకింగ్!: అద్వానీ దిగ్భ్రాంతి, పాక్కు ధీటుగా
న్యూఢిల్లీ: 26/11 ముంబై నిందితుడు జకీవుర్ రెహ్మాన్ లఖ్వీకి బెయిల్ రావడంపై యావద్భారతదేశం షాక్కు గురయింది! దీనిపై పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ మాట్లాడుతూ.. ఇది తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు.
ఉగ్రవాదికి బెయిల్ ఇవ్వడం వల్ల పాక్ ప్రతిష్ట మరింత మసకబారుతుందని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ అంతే అని అద్వాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్సీపీ నేత మజీద్ మెమన్ మాట్లాడుతూ.. పెషావర్ చిన్నపిల్లలను ఉగ్రవాదులు చంపిన ఘటన ఇంకా మరిచిపోలేదని, దానిని ప్రపంచమంతా చూసిందన్నారు. ఉగ్రవాదులను ఏరివేస్తామని చెబుతూనే, ఇలాంటి సమయంలో బెయిల్ రావడం విచారకరమన్నారు.
కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. ఇది దురదృష్టకరమైనదన్నారు. 26/11 ముంబై దాడిలో లఖ్వీయే కీలక సూత్రదారి అని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. బెయిల్ రద్దు కోరుతూ పాక్ ప్రభుత్వం అప్పీలు చేస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.
పాకిస్తాన్తో మాట్లాడుతామని భారత విదేశాంగ శాఖ మంత్రి చెప్పారు. భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా, లఖ్వీకి బెయిల్ రావడం పైన పలువురు స్పందిస్తూ.. ఇది దురదృష్టకరమని, దీని ద్వారా ఈ కేసులో న్యాయం జరుగుతుందన్న ఆశలు సన్నగిల్లుతున్నాయనే అనుమానాలు వ్యక్తం కూడా చేస్తున్నారు. కాగా, పాకిస్తాన్కు ఘాటైన ప్రతిస్పందన ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతోంది.
షాకింగ్: ఉజ్వల్ నికమ్
26/11 నిందితుడు లఖ్వీకి పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు బెయిల్ ఇవ్వడం షాకింగ్ విషయమని ముంబై టెర్రర్ అటాక్ కేసు ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ అన్నారు. ఆయన ఓ న్యూస్ చానల్తో మాట్లాడారు. ఇది చాలా పెద్ద షాకింగ్ వార్త అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆధారాలు లేవని కోర్టు చెప్పడం అంటే.. ఆధారాలు కోర్టుకు సరిగా సమర్పించలేదనే అర్థమన్నారు.
లఖ్వీని నిందితుడిగా చెబుతూ భారత్ ఆధారాలను పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇచ్చిందని తెలిపారు. అంతేకాకుండా తాము నిందితుడిని కోర్టు ముందు దోషిగా నిలబెడతామని హామీ ఇచ్చారని చెప్పారు. తీవ్రవాదం పైన పోరాడాలనే చిత్తశుద్ధి పాకిస్తాన్కు ఉంటే ముందు తమ వద్ద ఉన్న తీవ్రవాదులను అణిచివేయాలన్నారు. అదే సమయంలో లఖ్వీ బెయిల్ను రద్దు చేయాలన్నారు.
ముంబై దాడిలో 166 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ టెర్రర్ అటాక్లో జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ కూడా కీలక ప్లానర్. ఇతను లష్కరే తోయిబా ఆపరేషన్ హెడ్. ఓ వైపు పెషావర్ పాఠశాలలో అమాయక చిన్నారులు, ఉపాధ్యాయులు మృతి చెందారు.
ఈ నేపథ్యంలో తీవ్రవాదాన్ని తుదముట్టిస్తామని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే లఖ్వీకి బెయిల్ లభించింది. అయితే, ఈ బెయిల్ టెక్నికల్ ఎర్రర్ అని పాక్ నమ్మించే ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా, భారత్ పైన మరిన్ని దాడులు చేస్తామని హఫీజ్ సయీద్ హెచ్చరించాడు. ఆ వెంటనే బెయిల్ రావడం గమనార్హం. పెషావర్లో విద్యార్థులను హతమార్చిన సమయంలోనే లఖ్వీకి బెయిల్ రావడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.