ట్రిపుల్ తలాక్ సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: త్రిపుల్ తలాక్ ద్వారా భార్యలకు విడాకులు ఇచ్చిన కేసులో దోషులైన పురుషులకు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేయవచ్చనే నిబంధనను బిల్లులో చేర్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ట్రిపుల్ తలాక్తో విడాకులు ఇవ్వడం చట్టవిరుద్ధమైన నేరంగా పరిగణిస్తూ భర్తకు మూడేళ్ల జైలు శిక్షవిధిస్తారు.
కాగా, ట్రిపుల్ తలాక్కు సంబంధించి బెయిల్ నిబంధన విపక్ష పార్టీల ప్రధాన డిమాండ్లలో ఒకటి కావడం గమనార్హం. తాజా సవరణ ప్రకారం తలాక్ చెప్పిన భర్తలపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయవచ్చు. కానీ, అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ పొందవచ్చు.
ఈ చట్టం ద్వారా బాధితురాలు తనకు, మైనర్ పిల్లలకు పరిహారం కోరుతూ మేజిస్ట్రేట్ను ఆశ్రయించవచ్చు. మేజిస్ట్రేట్ నిర్ణయానుసారం మైనర్ పిల్లలను తన ఆధీనంలోకి తీసుకునే వెసులుబాటు ఉంది.
ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభ ఆమోదం కోసం సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. తలాక్ బిల్లులో సవరణలు చేయాల్సిందిగా పలు పార్టీలు సూచించాయి. ఈ సవరణలు చేసేందుకు కేంద్రం అంగీకరించి, తాజాగా సవరణలు చేసిన బిల్లుకు ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించింది.