సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా
ఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన మహిళ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ విచారణను వాయిదా వేసింది మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు. సీజేపై ఆరోపణలు చేసిన మహిళ సుప్రీంకోర్టులో పనిచేస్తోంది. నవీన్ కుమార్ అనే వ్యక్తికి సుప్రీంకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అతని దగ్గర నుంచి ఆ మహిళ రూ. 50వేలు తీసుకున్నట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి.
మహిళ తరుపున వాదించిన న్యాయవాది వీకే వోరా మహిళకు సంబంధించిన వస్తువులు అనగా మొబైల్ ఫోన్, సీపీయూలను తిరిగి ఇచ్చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ అంశాన్ని కూడా తర్వాత పరిశీలిస్తామని చెప్పిన జస్టిస్ ఖురానా కేసు విచారణను మే 23కు వాయిదా వేశారు. అంతేకాదు ఈ కేసు నమోదు చేసిన వ్యక్తికి కూడా అంటే నవీన్కుమార్కు కూడా సమన్లు జారీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు జస్టిస్ ఖురానా.
ఇక అసలు విషయానికొస్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్గా పనిచేస్తోంది. నవీన్ కుమార్కు కోర్టులో ఉద్యోగం కల్పిస్తానని చెప్పి ఆయన దగ్గర రూ. 50వేలు తీసుకుంది. అయితే నెలలు గడుస్తున్నప్పటికీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లి ఆమెను కలిశాడు నవీన్ కుమార్. తన ఉద్యోగం సంగతి గురించి ప్రస్తావించగా.. నవీన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు ప్రాంగణంలోకి రాకూడదని ..ఇలా మరొకసారి వచ్చావంటే ఏదో ఒక కేసు బనాయిస్తానని బెదిరించింది. దీంతో నవీన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు గత నెలలోనే ఆమెను అరెస్టు చేసి మార్చి 3న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మార్చి 11న ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి తరలించగా మార్చి 12న బెయిల్ పై విడుదలైంది. దీన్ని ఢిల్లీ క్రైం బ్రాంచ్ విచారణ చేస్తోంది. విచారణ జరుగుతున్న సమయంలో ఆ మహిళ ఆమెకు చెందిన కొందరు వ్యక్తులు తనను బెదిరిస్తున్నారని తెలుపుతూ డీసీపీకి లేఖ రాశారు. ఈ క్రమంలోనే విచారణాధికారి మహిళ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. కేసును వచ్చే నెల 23కు జడ్జి వాయిదా వేశారు.