కేజ్రీవాల్కు మరో షాక్: వారెంట్ జారీ చేసిన అస్సాం కోర్టు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మరో షాక్ తగిలింది. పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అస్సా కోర్టు..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మరో షాక్ తగిలింది. పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అస్సా కోర్టు.. అరవింద్ కేజ్రీవాల్కు వారెంట్ జారీ చేసింది. గత సంవత్సరం ప్రధాని మోడీ డిగ్రీ గురించి కేజ్రీవాల్ చేసిన ట్వీట్పై దాఖలైన పరువునష్టం దావా కేసులో కేజ్రీవాల్ సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా... ఆయన హాజరుకాలేదు. దీంతో కోర్టు ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
తదుపరి విచారణను మే 8వ తేదీకి వాయిదా వేసింది. మోడీపై చేసిన వ్యాఖ్యలకు అసోం భారతీయ జనతా పార్టీ నేత సూర్య రోంగ్ఫర్.. కేజ్రీవాల్పై పరువునష్టం దావా వేశారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో పాటు ముఖ్యమంత్రిగా ఆయనకున్న పనుల కారణంగా ప్రస్తుతం కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని, మరింత సమయం ఇవ్వాలని కేజ్రీవాల్ తరపు లాయర్.. న్యాయమూర్తిని కోరారు.
అయితే లాయర్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. గతంలో జనవరి 30న కూడా కేజ్రీవాల్ హాజరుకాకపోవడంతో న్యాయస్థానం రూ.10వేల వారెంట్ జారీ చేసింది. కేజ్రీవాల్, ఆయన ఆమ్ఆద్మీ పార్టీ.. మోడీ డిగ్రీపై అనుమానాలు వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే.
12వ తరగతి వరకు మోడీ చదువుకున్నారు.. ఆ తర్వాత డిగ్రీ సర్టిఫికేట్లన్నీ నకిలీవేనని ఆరోపించారు. దీంతో మోడీ డిగ్రీ నిజమైనదేనని.. ఆయన 1978లో పరీక్ష పాసయ్యారని, 1979లో డిగ్రీ పట్టా తీసుకున్నారని యూనివర్సిటీ రిజిస్టార్ గత సంవత్సరం స్పష్టం చేశారు.