విభజన: చిద్దూ సహా అగ్రనేతలకు కోర్టు వారంట్లు
అనంతపురం: రాష్ట్ర విభజనలో పార్టీ నిర్ణయాన్ని ప్రభుత్వ నిర్ణయంగా పరిగణించి ఒక ప్రాంతానికి అన్యాయం చేశారంటూ వేసిన కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, మాజీ కేంద్ర మంత్రులకు అనంతపురం ఫ్యామిలీ కోర్టు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.
మల్లికార్జున, నాగన్న అనే అనంతపురం జిల్లా న్యాయవాదులు రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ అగ్రనేతలపై అనంత కోర్టులో ఈ అంశానికి సంబంధించి కేసు వేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాతోపాటు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు సుశీల్కుమార్ షిండే, వీరప్పమొయిలీ, గులాం నబీ ఆజాద్, చిదంబరం, కె.సాంబశివరావు, జయపాల్రెడ్డి పేర్లను ఇందులో చేర్చారు.
ఈ కేసును విచారించిన అనంతపురం ఫ్యామిలీ కోర్టు వారందరికీ సమన్లు జారీ చేసింది. అయితే వీరిలో షిండే, ఆజాద్, చిదంబరం సమన్లు అందుకున్నప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడంతో బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుపై శుక్రవారం విచారణ జరిగింది.
ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి విజయకుమార్ ఆ ముగ్గురికీ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 8వ తేదీకి వాయిదా వేశారు.