మతమార్పిడి: గుండి కొట్టించి గాడిదపై ఊరేగించారు
లక్నో: ఉత్తర ప్రదేశ్లో శుక్రవారం జరిగిన ఓ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముగ్గురు హిందువులను బలవంతంగా మత మార్పిడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఓ వ్యక్తిని అతిదారుణంగా అవమానించిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ఒరాయ్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే, జలావున్ జిల్లా రాందర్ కు చెందిన అద్వేశ్ సవిత అనే వ్యక్తి ఇటీవల ఓ ముగ్గురు హిందువులను క్రైస్తవ మతంలోకి చేర్పించారు. అంతేకాదు వారితో గోమాంసాన్ని వారితో బలవంతంగా తినిపించాడని సమాచారం అందుకున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు రెచ్చిపోయారు.
దాదుపు 200 మంది భజరంగ్ దళ్ కార్యకర్తలు అద్వేశ్ సవిత ఇంటిపై దాడి చేశారు. అతన్ని ఇంటి నుంచి బయటకు లాక్కుని వచ్చారు. అనంతరం జిల్లాలోని ఒరాయ్ పట్టణానికి తీసుకొచ్చారు. గుండు గీసి, మీసాలు, కను బొమ్మలు సైతం తీసి వేయించారు. అనంతరం మెడలో చెప్పుల దండ వేసి పట్టణంలో గాడిపై ఊరేగించారు.
పట్టపగలే ఇంత జరుగుతున్నా ఒక్క పోలీసు కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. ఊరేగింపు తర్వాత బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ సంఘటపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన జలావున్ ఎస్పీ దీనిపై దర్యాప్తుకు ఆదేశించామన్నారు. ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని సమాచారం.