బాలాకోట్ వైమానిక దాడులపై తొలిసారిగా నోరు విప్పిన రక్షణమంత్రి నిర్మలా సీతారామన్
చెన్నై: పాకిస్తాన్ భూభాగంపై ఉన్న బాలాకోట్ పట్టణ సమీపంలో జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన శిక్షణ శిబిరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులపై రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా నోరు విప్పారు. బాలాకోట్ వైమానిక దాడులకు సంబంధించిన సాక్ష్యాధారాలను బహిర్గతం చేయాలని, ఈ దాడుల్లో హతమైన ఉగ్రవాదుల సంఖ్య ఎంతో వెల్లడించాలని కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు డిమాండ్ చేస్తున్న సమయంలో.. నిర్మలా సీతారామన్ ఈ అంశంపై మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆయన మాటే .. మా మాట
ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నైకి వచ్చిన ఆమె.. బాలాకోట్ వైమానిక దాడులకు క్లుప్తంగా మాట్లాడారు. వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయలేదు. బాలాకోట్ వైమానిక దాడుల్లో ఏ ఒక్క సాధారణ పౌరుడు కూడా మరణించలేదని నిర్మలా సీతారామన్ చెప్పారు. అంతవరకే తాను హామీ ఇవ్వగలనని అన్నారు. వైమానిక దాడులపై ఇదివరకు విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ఒక విస్పష్ట ప్రకటన చేశారని గుర్తు చేశారు. తన మాట కూడా అదేనని, విజయ్ గోఖలే వెల్లడించిన విషయాలకు మించి ఒక్క మాట కూడా తాను అదనంగా మాట్లాడలేనని అన్నారు. బాలాకోట్ పై వైమానిక దాడులు సైనిక చర్య కాదు.. అని తేల్చి చెప్పారు.
బాలాకోట్ పై దాడుల్లో ఎంతమంది హతమయ్యారనే విషయంపై విజయ్ గోఖలే ఎలాంటి సంఖ్యను కూడా వెల్లడించలేదని చెప్పారు. ఆయన విడుదల చేసిన ప్రకటనలోనూ ఎక్కడా హతుల సంఖ్యను పొందుపరచలేదని అన్నారు. విజయ్ గోఖలే చేసిన ప్రకటనను భారత ప్రభుత్వం చేసిన ప్రకటనగానే భావించాల్సి ఉంటుందని ఆమె సూచించారు. వైమానిక దాడులకు సంబంధించిన ఉపగ్రహ ఫొటోలను బహిర్గతం చేయాలంటూ విపక్షాలు చేసిన డిమాండ్ల పట్ల నిర్మలా సీతారామన్ స్పందించారు. వారి డిమాండ్లపై ఇప్పటికిప్పుడు తానేమీ వ్యాఖ్యానించబోనని చెప్పారు.
యూపీఏ ప్రభుత్వం కూడా అదే చేసింది..
భారత్ పై తరచూ దాడులకు దిగుతున్న కరడుగట్టిన ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే వస్తున్నారనడానికి తమ వద్ద సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయని ఆమె అన్నారు. యూపీఏ ప్రభుత్వం కూడా ఆయా సాక్ష్యాధారాలను సేకరించి, పాకిస్తాన్ కు అందజేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. చాలాకాలంగా ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని, ఈ విషయం యూపీఏకు కూడా తెలుసని అన్నారు. పాకిస్తాన్ లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఉన్నాయనడానికి అవసరమైన సాక్ష్యాలను ఆ దేశానికి అందించామని చెప్పారు. ఇంతా చేసినప్పటికీ.. పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి ఎలాంటి కఠిన చర్యలను కూడా తీసుకోలేదని అన్నారు. 26/11 నాటి ముంబై దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనే విషయానికి సంబంధించిన సరైన సాక్ష్యాలను పాకిస్తాన్ ప్రభుత్వానికి అందజేసినప్పటికీ.. పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందని చెప్పారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదులపై న్యాయస్థానాల ద్వారా చర్యలు తీసుకోలేదని అన్నారు.