బాలాకోట్..వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ కు కంచుకోట: లాడెన్ సొంత పట్టణానికి 50 కిలోమీటర్ల దూరమే
శ్రీనగర్: బాలాకోట్.. చుట్టూ ఎత్తయిన కొండలు, పట్టణం మధ్యలో ప్రవహించే పిల్ల కాలువలు, చల్లటి వాతావరణం.. చూడగానే ప్రముఖ పర్యాటక కేంద్రాన్ని తలపించేలా ఉంటుంది ఆ చిన్న పట్టణం. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉంటుంది. జన సంచారం పెద్దగా ఉండదు. అక్కడ నివసించే ప్రజలకు పెద్దగా చదువు రాదు. కొత్తగా ఎవరైనా ఆ పట్టణాన్ని చూస్తే.. అదో పర్యాటక కేంద్రమేమో అని భావించేంత అందంగా ఉంటుంది. అలాంటి పట్టణం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. రెండు దేశాల ప్రజల నోళ్లల్లో నానుతోంది.
దీనికి కారణం- మనదేశ వైమానిక దళం.. ఈ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఏర్పాటైన ఉగ్రవాద శిబిరాలపై యథేచ్ఛగా దాడులు చేయడమే. మంగళవారం తెల్లవారు జామున 3:30 గంటల సమయంలో శ్రీనగర్ ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్ నుంచి బయలుదేరిన మిరేజ్, జెట్ ఫైటర్లు మొట్టమొదటగా దాడులు చేసింది ఇక్కడే. బాలాకోట్ చుట్టూ ఉన్న పర్వతాల్లో ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న శిబిరాలపై నిరంతరంగా దాడులు కొనసాగించాయి మనదేశ వైమానిక బలగాలు. దీనితో ఈ చిన్న పట్టణం అందరి దృష్టినీ ఆకట్టుకుంది.
బాలాకోట్.. మసూద్ అజర్ కు కంచుకోట
పాకిస్తాన్ లోని ఖైబర్ ఫక్తున్ ఖ్వా ప్రావిన్స్ పరిధిలో ఉన్న మన్ సెహ్రా జిల్లాలోని చిన్న పట్టణం బాలాకోట్. మనదేశ సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది. వాంటెడ్ టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజర్ కు ఈ పట్టణం పెట్టని కోట. అజర్ సాగించిన ఉగ్రవాద కార్యకలాపాలకు బాలా కోట్ కేంద్రబిందువుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. 2001 వరకూ అజర్.. కొన్నాళ్ల పాటు ఇదే పట్టణంలో నివసించాడు. ఆ సమయంలోనే బాలాకోట్ సహా చుట్టు పక్కల ఉన్న కొండ ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకుని, జైషె మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేశాడు. ఉగ్ర కార్యకలాపానలు కొనసాగించాడు.
ర్యాలీలు, రిక్రూట్ మెంట్లూ ఇక్కడి నుంచే..
2001లో మౌలానా మసూద్ అజర్ ఈ పట్టణాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్న తరువాత.. జైషె మహమ్మద్ పేరిట తరచూ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించేవాడని సమాచారం. బహిరంగ సభలను ఏర్పాటు చేసి, అక్కడి యువతను జైషె మహమ్మద్ పట్ల ఆకర్షితులయ్యేలా చేసే వాడని తెలుస్తోంది. బాలాకోట్ లోని బెస్యాన్ చౌక్ వద్ద అనేక సార్లు మసూద్ అజర్.. బహిరంగ సభలను నిర్వహించినట్లు సమాచారం ఉంది. జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరదల్చిన యువకులు మొట్టమొదటి సారిగా బాలాకోట్ పరిసరాల్లో ఉన్న శిబిరాల్లోనే ఉగ్ర కార్యకలాపాలపై శిక్షణ ఇస్తారని తెలుస్తోంది. ఈ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని భారీ ఎత్తున రిక్రూట్ మెంట్లు కొనసాగాయని అధికారులు చెబుతున్నారు.
దాడులు ఇక్కడి నుంచే..
జమ్మూకాశ్మీర్ సహా మనదేశ భూభాగం వెంట, వాస్తవాధీన రేఖ వెంబడి ఉండే భారత సైనిక శిబిరాలపై ఇక్కడి నుంచే దాడులు చోటు చేసుకునేవి. బాలాకోట్ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో జైషె మహమ్మద్ శిబిరాలు ఉన్న సమాచారం మనదేశ సైన్యం వద్ద ఉంది. అందుకే- బాలాకోట్ ను కేంద్రంగా చేసుకుని వైమానిక దళాలు దాడులు చేశాయి. తాజాగా చేపట్టిన ఈ దాడుల్లో జైషె మహమ్మద్ కు చెందిన మూడు ఆల్ఫా కంట్రోల్ రూములు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
లాడెన్ స్వస్థలానికి 50 కిలోమీటర్ల దూరం..
కరడుగట్టిన అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ స్వస్థలం అబోట్టాబాద్. అమెరికా సైనికులు ఈ పట్టణంలోనే బిన్ లాడెన్ ను కాల్చి చంపాయి. ఈ అబోట్టాబాద్.. బాలాకోట్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. బాలాకోట్ లో విచ్చలవిడిగా ఉగ్ర కార్యకలాపాలు కొనసాగడానికి ఇదీ ఒక కారణం అనడంలో సందేహాలు అక్కర్లేదు. లాడెన్ సహా అల్ ఖైదా ఉగ్రవాదులు తరచూ బాలాకోట్ కు వచ్చేవారని, జైషె మహమ్మద్ కార్యకలాపాలను పర్యవేక్షించే వారని సమాచారం.