బాలాకోట్ లో భారీగా ఉగ్రవాదులకు శిక్షణ: సరిహద్దుల్లో 500 టెర్రరిస్టులు తిష్ఠ: ధృవీకరించిన ఆర్మీ చీఫ్
చెన్నై: పాకిస్తాన్ లోని బాలాకోట్ లో మరోసారి ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలు భారీగా వెలిశాయని మనదేశ సర్వ సైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్ తెలిపారు. జైషె మహమ్మద్ ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తున్నట్లు ఇంటెలిజెన్స్ విభాగం అధికారుల నుంచి తమకు పక్కా సమాచారం అందినట్లు ఆయన వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ సహా భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎప్పుడైనా, ఎలాంటి పరిస్థితులైనా తలెత్తే వాతావరణం నెలకొని ఉందని, ఈ నేపథ్యంలో తాము అనుక్షణం అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి చొచ్చుకుని వెళ్లడానికి సైన్యం సిద్ధంగా ఉందని బిపిన్ రావత్ అన్నారు. బాలాకోట్ లో మరోసారి పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు తిష్ఠ వేశారంటూ వస్తోన్న వార్తలను ఆయన ధృవీకరించారు. ఆ వార్తలు నిజమేనని అన్నారు.
సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు.. మొత్తం జడ్జిల సంఖ్య ఎంతో తెలుసా?
500 మంది ఉగ్రవాదులు..
సోమవారం ఉదయం ఆయన చెన్నైకి వచ్చారు. యంగ్ లీడర్స్ ట్రైనింగ్ వింగ్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో వాతావరణం ఆశించిన స్థాయిలో ఏ మాత్రం లేదని అన్నారు. జమ్మూ కాశ్మీర్ మొదలుకుని, రాజస్థాన్ గుజరాత్ లోని సర్ క్రీక్ ప్రాంతం వరకూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ భూభాగంపై సుమారు 500 మంది వరకు ఉగ్రవాదులు తిష్ట వేసుకుని కూర్చున్నట్లు సమాచారం ఉందని అన్నారు. ఈ పరిస్థితుల్లో తాము అప్రమత్తంగా ఉన్నామని, సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని అన్నారు. ఎప్పుడైనా, ఏదైనా, ఎలాంటి పరిస్థితులైనా తలెత్తడానికి గల అవకాశాలను కొట్టి పారేయలేమని బిపిన్ రావత్ తేటతెల్లం చేశారు. ఎలాంటి పరిస్థితి ఎదురొచ్చినా సమర్థవంతంగా తిప్పి కొడతామని అన్నారు.
పాక్ ప్రభుత్వమే..కారణమా?
పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోలేదు. బుద్ధిని పోనిచ్చుకోలేదు. భారత్ పై దాడులు చేపట్టేలా ఉగ్రవాదులను వెన్నతట్టి ప్రోత్సహించేలా ప్రవర్తిస్తోందనే విమర్శలు మరోసారి వెల్లువెత్తాయి. జమ్మూ కాశ్మీర్ లో సరిహద్దులకు అవతల పాకిస్తాన్ భూభాగంలో ఖైబర్ ఫక్తున్ ఖ్వా ప్రావిన్స్ లో ఉన్న బాలాకోట్ లో జైషె మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలు మళ్లీ తమ కార్యకలాపాలను ఆరంభించినట్లు తెలుస్తోంది. ఈ సారి ప్రభుత్వమే వాటిని దగ్గరుండి ఏర్పాటు చేయించిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇదివరకంటి కంటే కూడా అధిక సంఖ్యలో బాలాకోట్ లో ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నట్లు మనదేశ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖకు అందజేసినట్లు సమాచారం.
సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత..
ఎక్కడైతే భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్ ను చేపట్టిందో.. అదే చోట మళ్లీ ఉగ్రవాద శిబిరాలు వెలిసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్ర హోం మంత్రిత్వశాఖకు కీలక సమాచారాన్ని అందజేసినట్లు చెబుతున్నారు. గతంలో కంటే అధికంగా ఉగ్రవాదులు అక్కడ శిక్షణ పొందుతున్నారనే విషయాన్ని ఉంటంకించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వ ఆధీనంలోని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎస్ఎస్జీ) కమెండోలు, ఐఎస్ఐ ఏజెన్సీల నుంచి ఈ ఉగ్రవాద శిబిరాలకు మద్దతు లభిస్తోందని ఇంటెలిజెన్స్ అధికారులు ధృవీకరించారు. వారి ప్రోత్సాహంతోనే ఉగ్రవాదులు తరచూ సరిహద్దులను దాటుకుని భారత్ మీదికి చొచ్చుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారని నిర్ధారించారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ సరిహద్దులతో పాటు గుజరాత్ లోని సర్ క్రీక్ సముద్ర జలాల ద్వారా భారత్ లోకి చొచ్చుకుని రావడానికి ఉగ్రవాదులు ఇదివరకే విఫల ప్రయత్నాలు చేసిన సందర్భాలను అధికారులు ఇందుకు ఉదహరిస్తున్నారు.
బాలాకోట్ ను నాశనం చేసినా..
ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహూతి దళం దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన చోటు చేసుకున్న 12 రోజుల తరువాత భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్ చేపట్టింది. పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ పై వైమానిక దాడులను నిర్వహించింది. బాలాకోట్ లో ఏర్పాటైన అతి పెద్ద ఉగ్రవాదుల శిబిరాన్ని నేలమట్టం చేసింది. ఆ ఘటనలో సుమారు 35 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు తేలినప్పటికీ.. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం గానీ, సైన్యం గానీ ధృవీకరించలేదు. వైమానిక దాడుల తరువాత కొన్ని రోజుల పాటు ఉగ్రవాద కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అదే సమయంలో మసూద్ అజర్ అరెస్టు అయ్యారు.