ఓటింగ్ యంత్రం ముందు ధ్యానం, కళ్లకు మొక్కుకున్న బళ్లారి శ్రీరాములు, ఎన్నికల నియమాలు!
బళ్లారి: బళ్లారి బీజేపీ ఎంపీ, కర్ణాటక ఉప ముఖ్యంత్రి అభ్యర్థి బి. శ్రీరాములు శనివారం ఓటు వేసే సమయంలో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఉదయం ఇంటిలో గోవుకు ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ ఎంపీ. శ్రీరాములు తరువాత తన మద్దతుదారులతో చర్చించారు. అనంతరం బి. శ్రీరాములు ఆయన తల్లి హోన్నూరమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు.
దేవాలయం
శనివారం ఉదయం బళ్లారి బీజేపీ ఎంపీ గోవుకు ప్రత్యేక పూజలు చేసి ప్రదక్షణలు చేశారు. తరువాత బళ్లారిలోని ప్రముఖ దేవాలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో కలిసి పోలింగ్ కేంద్రం దగ్గరకు వెళ్లారు.
శ్రీరాములు ధ్యానం
బళ్లారిలోని దేవీనగర్ లోని 25వ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన బళ్లారి శ్రీరాములు మొదట ఆయన కుటుంబ సభ్యులతో ఓటు వేయించారు. అనంతరం ఈవీఎం దగ్గరకు వెళ్లిన బీజేపీ ఎంపీ శ్రీరాములు ఒక్క నిమిషం ధ్యానం చేశారు. అనంతరం మూడుసార్లు ఈవీఎంను ముట్టుకుని కళ్లకు దండం పెట్టుకున్న శ్రీరాములు ఓటు వేసి అక్కడున్న అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ఎన్నికల నియమాలు
ఈవీఎంలకు పూజులు చెయ్యడం ఎన్నికల నియమాలకు విరుద్దం. అయితే బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు ఈవీఎంను మూడుసార్లు ముట్టుకుని కళ్లకు దండం పెట్టుకోవడం చట్టపరంగా వ్యతిరేకమా అంటూ ఇప్పుడు బళ్లారిలో జోరుగా చర్చ జరుగుతోంది. బళ్లారి శ్రీరాములు ఈవీఎంకు పూజలు చెయ్యలేదని, దండం పెట్టుకున్నారని ఆయన అనుచరులు అంటున్నారు.
శ్రీరాములు తల్లి ధీమా
దేవీనగర్ లోని 52వ పోలింగ్ కేంద్రంలో శ్రీరాములు తల్లి హోన్నూరమ్మ, బళ్లారి గ్రామీణ జిల్లా బీజేపీ అభ్యర్థి సన్నపకీరప్ప, మాజీ ఎంపీ శాంతా (అందరూ శ్రీరాములు బంధువులు) ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీరాములు తల్లి హోన్నూరమ్మ తన కుమారుడు రెండు నియోజక వర్గాల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.