అక్రమ మైనింగ్ కేసు: పోలీసు కస్టడీకి బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే: చెన్నై సీబీఐ అధికారుల విచారణ
బెంగళూరు: అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటకలోని బళ్లారి గ్రామీణ శాసన సభ నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే బి. నాగేంద్రను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బెంగళూరు నగరంలోని ప్రజా ప్రతినిధుల న్యాయస్థానం న్యాయమూర్తి రామచంద్ర డి. హుద్దార ఆదేశాల మేరకు ఎమ్మెల్యే నాగేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బళ్లారి జిల్లా అక్రమ మైనింగ్ కేసులో ఎమ్మెల్యే నాగేంద్ర మీద కేసు నమోదు అయ్యింది. బెంగళూరు నగరంలోని ప్రజా ప్రతినిధుల న్యాయస్థానంలో నాగేంద్ర విచారణ ఎదుర్కొంటున్నారు. కోర్టు విచారణకు పదేపదే హాజరుకాని నాగేంద్ర మీద ఇటీవల న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
2019 ఏప్రిల్ లో ఎమ్మెల్యే నాగేంద్రను కస్టడీలోకి తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గతంలో అనేక సార్లు సమున్లు జారీ చేసినా ఎమ్మెల్యే నాగేంద్ర మాత్రం కోర్టు ముందు హాజరుకాలేదు. సమున్లు జారీ చేసినా పట్టించోని ఎమ్మెల్యే నాగేంద్ర సోమవారం కోర్టు ముందు హాజరైనారు.
కేసు విచారణ చేసిన న్యాయమూర్తి ఎమ్మెల్యే నాగేంద్రను ఒక్కరోజు కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మీకు పదేపదే అవకాశం ఇచ్చామని, అయినా మీరు కోర్టు ముందు హాజరుకాలేదని, అందుకే పోలీసు కస్టడీకి ఆదేశిస్తున్నామని న్యాయస్థానం తెలిపింది.
బళ్లారి జిల్లా బెళేకేరి ఇనుపు ఖనిజం మాయం అయిన కేసు, అక్రమ మైనింగ్ కేసు విషయంలో విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్, బళ్లారి గ్రామీణ నియోజక వర్గం ఎమ్మెల్యే బి. నాగేంద్ర మీద 2019 జనవరిలో బెంగళూరు నగరంలోని ప్రజా ప్రతినిధుల న్యాయస్థానంలో విచారణ మొదలైయ్యింది.
అయితే విచారణకు హాజరు కాని ఇద్దరు ఎమ్మెల్యేల మీద అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. అక్రమ మైనింగ్ కేసు విషయంలో చెన్నైలోని సీబీఐ అధికారులు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగేంద్ర మీద విచారణ పూర్తి చేశారు. ఎమ్మెల్యే నాగేంద్ర మీద నమోదైన కేసు విచారణ పూర్తి చేసిన సీబీఐ అధికారులు న్యాయస్థానంలో నివేదిక సమర్పించారు.