బళ్లారిలో బీజేపీకి భారీ దెబ్బ: గాలి, శ్రీరాములు శిష్యుడు జంప్, ఎమ్మెల్యే, పార్టీకి గుడ్ బై!
బెంగళూరు: బళ్లారి జిల్లాలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బళ్లారి జిల్లా హోస్ పేట (విజయనగర) బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనంద్ సింగ్ తన పదవికి జనవరి 27వ తేదీ శనివారం రాజీనామా చెయ్యడానికి సిద్దం అయ్యారు. మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి ఎంపీ శ్రీరాములు ప్రధాన అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ సింగ్ బీజేపీ నాయకుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలని, పార్టీకి గుడ్ బై చెప్పాలని తీర్మానించారు.
నాయకులతో భేటీ
హోస్ పేట ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ తన నివాసంలో అనుచరులతో భేటీ అయ్యి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆనంద్ సింగ్ శనివారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, త్వరలో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని, అయితే ఏ పార్టీ అని ఇప్పుడే చెప్పలేనని అన్నారు.
రూ. 120 కోట్ల నిధులు
ఫిబ్రవరి 16వ తేదీ జరిగే బడ్జెట్ సమావేశంలో హోసపేట నియోజక వర్గానికి రూ. 120 కోట్ల నిధులు కేటాయించుకుంటానని, గ్రామీణ భాగ్య పథకంలో భాగంగా రూ. 200 కోట్లు కేటాయించుకుంటానని, ప్రజలు తన వెంటే నడవాలని ఆనంద్ సింగ్ అన్నారు.
ప్రజల కోసం ఈ నిర్ణయం
ఎన్నికల వచ్చిన సమయంలో ప్రజల ముందు ప్రత్యక్షం అయ్యే నాయకుడు తాను కాదని, నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటానని, రాష్ట్రంలో రాజకీయాలు మారవలసిన పరిస్థితి వచ్చిందని, తాను ద్వేష రాజకీయాలు ఎప్పుడు చెయ్యలేదని, ఇక ముందు చెయ్యనని, ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని ఆనంద్ సింగ్ చెప్పారు.
నన్ను గెలిపిస్తారు
2018లో జరిగే శాసన సభ ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని, హోస్ పేట నియోజక వర్గ ప్రజలు తనను గెలిపిస్తారని, అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేసిది త్వరలోనే ప్రకటిస్తానని ఆనంద్ సింగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో హోస్ పేట ప్రజలు చరిత్రను తిరగరాయాలని ఆనంద్ సింగ్ పిలుపునిచ్చారు.
బీజేపీకి ఎదురు దెబ్బ
ఆనంద్ సింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించడంతో హోస్ పేట నియోజక వర్గంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రాణి సంయుక్త ఆనంద్ సింగ్ సోదరి, తాలుకా బీజేపీ అధ్యక్షుడు సందీప్ సింగ్ ఆనంద్ సింగ్ సోదరి అల్లుడు, తాలుకా మహిళా మోర్చ అధ్యక్షురాలు కవితా ఈశ్వర్ ఆనంద్ సింగ్ వదిన. వీరందరూ శనివారం పదవులుకు రాజీనామా చేసే అవకాశం ఉంది.
సీఎం సిద్దూతో భేటీ
ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ ను ఆనంద్ సింగ్ కలిశారు. అప్పటి నుంచి ఆనంద్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆనంద్ సింగ్ ను కాదని మరో గనుల వ్యాపారిని బీజేపీ రంగంలోకి దించుతుందని తెలుసుకున్న ఆనంద్ సింగ్ కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
హోస్ పేట చరిత్ర
2013లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో హోస్ పేట నియోజక వర్గంలో పోటీ చేసిన ఆనంద్ సింగ్ (బీజేపీ)కు 69,995, ఓట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన హెచ్. అబ్దుల్ వహాబ్ కు 39,358 ఓట్లు, జేడీఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన కే. బసవరాజ్ కు 611 ఓట్లు వచ్చాయి.