పాక్ బోర్డర్: అనుమానాస్పద వస్తువు కూల్చివేత
జైపూర్/ఢిల్లీ: పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో అనుమానాస్పదంగా గాలిలో ఎగురుతున్న ఒక గుండ్రని ఆకృతి(బెలూన్ లాంటి) వస్తువును భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానం మంగళవారం కూల్చివేసింది. రాజస్థాన్ రాజధాని జైపూర్కు సుమారు 500 కి.మీల దూరంలోని బార్మర్ జిల్లా సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకుంది.
భారత వైమానిక దళ అధికార వర్గాల సమాచారం ప్రకారం.. భారతదేశమంతా గణతంత్ర వేడుకలు జరుపుకొంటున్న సమయంలో ఉదయం 10.30 - 11 గంటల ప్రాంతంలో పాక్ వైపునకు ఉన్న పశ్చిమ సెక్టార్ నుంచి ఒక గుర్తుతెలియని బంతి ఆకారంలో ఉన్న వస్తువును ఐఏఎఫ్ రాడార్ గుర్తించడంతో దాన్ని కూల్చివేశారు.
ఈ విషయమై ఐఏఎఫ్ దర్యాప్తు జరుపుతోంది. అంతకు ముందు బార్మర్ ప్రాంతంలోని కొన్ని గ్రామాల ప్రజలు ఆకాశం నుంచి లోహపు తునకలు పడుతున్నట్లు ఫిర్యాదు చేశారు.
దీంతో అదనపు ఎస్పీ జస్సారాం బోస్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం ఆ ప్రాంతానికి వెళ్లి త్రికోణాకారంలో ఉన్న 5 తునకలను పరిశీలించింది. అయితే అవి పేలుడు పదార్థాలు కావని నిర్ధారణకు వచ్చింది. ఆ తునకలను ఐఏఎఫ్కు అందజేసినట్లు పోలీసులు తెలిపారు.