'ఇంకా ఏంచూస్తారు.. పాక్పై యుద్ధం ప్రకటించండి, ఢిల్లీలో బెలూచిస్తాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లో జరిగిన పుల్వామా టెర్రర్ దాడిలో 42 మంది జవాన్లు అమరులయ్యారు. దీనిపై యావత్ భారత దేశం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ దాడిని ఖండించాయి. పాకిస్తాన్ వైపు భారత్తో సహా పలు దేశాలు వేళ్లు చూపిస్తున్నాయి. బెలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ పైన మండిపడుతోంది.
అనుమానం లేదు.. ఈ దాడి వెనుక పాక్ ఉంది
పుల్వామా తీవ్రవాద ఘటనపై బెలూచిస్తాన్ నేషనల్ కాంగ్రెస్ (బీఎన్సీ) తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్తో దౌత్యపరమైన సంబంధాలు తెంచుకోవాలని భారత్కు సూచించింది. అంతేకాదు, భారత్ వెంటనే పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. బీఎన్సీ బాడీ అమెరికాలో ఉంటోంది. బీఎన్సీ ప్రెసిడెంట్ వాహిద్ బాలోచ్ మాట్లాడుతూ... ఈ ఉగ్రవాద దాడి వెనుక కచ్చితంగా పాకిస్తాన్ ఉందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని చెప్పారు. ఈ దాడికి కారణమైన వారికి కచ్చితంగా బుద్ధి చెప్పాలన్నారు. పాక్ను ఉపేక్షించవద్దని అభిప్రాయపడ్డారు.
పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించండి
బీఎన్సీ నేతలు మాట్లాడుతూ.. పాకిస్తాన్ పైన భారత్ వెంటనే యుద్ధం ప్రకటించాలని చెప్పారు. ఇలాంటి తీవ్రాద దాడుల ద్వారా పాకిస్తాన్.. భారత్ పైన ప్రోక్సీ వార్కు తెరలేపుతోందన్నారు. తమ అమాయక, దేశం కోసం పని చేసే జవాన్లను కోల్పోయినందున భారత్.. పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్న పాక్పై ప్రతీకారం తీర్చుకోవాలన్నారు.
భారత్లో బెలూచిస్తాన్ ప్రభుత్వం (ప్రవాస ప్రభుత్వం)కు సహకరించండి
భారతదేశంలో.. బెలూచిస్తాన్ ప్రభుత్వం (ప్రవాస బెలూచిస్తాన్ ప్రభుత్వం) ఏర్పాటు చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలని బెలూచిస్తాన్ నేత ఖాన్ కాలత్ విజ్జప్తి చేశారు. అంతేకాకుండా, పాకిస్తాన్ తమ దేశాన్ని అక్రమంగా ఆక్రమించుకుందని, దీనిపై కేసు పెట్టేందుకు తమకు సహకరించాలని కోరారు. అంతర్జాతీయ కోర్టులో పాకిస్తాన్ను దోషిగా తేల్చేందుకు తమకు సహకరించాలని చెప్పారు.