బోయింగ్ 737 రద్దు: ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?
ముంబై: ఓ విమాన ప్రమాదం.. మనదేశంలో విమానయాన సంస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వాటి ఆర్థిక లావాదేవీలను తలకిందులు చేస్తోంది. ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ 737 మ్యాక్స్ 8 రకానికి చెందినది కావడమే దీనికి ప్రధాన కారణం. ఆ రకం విమానాలను ఉన్న సంస్థలు.. ప్రపంచవ్యాప్తంగా నష్టాలను చవి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇథియోపియా నుంచి 157 మంది ప్రయాణికులు, సిబ్బందితో కెన్యాకు బయలుదేరిన ఆ దేశానికి చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 రకం విమానం.. కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరు కూడా బతికి బట్ట కట్టలేదు. విమానంతో పాటు కాలి బూడిదయ్యారు. ఈ ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని విమానయాన సంస్థలు ఉలిక్కి పడ్డాయి. ప్రభుత్వాలు కూడా మేల్కొన్నాయి.
రాహుల్ గాంధీపై దేశ ద్రోహ కేసు .. ఎందుకంటే ?
బోయింగ్ 737 మ్యాక్స్ 8 రకానికి చెందిన విమానాల సర్వీసులపై నిషేధాన్ని విధించాయి. మన దేశం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. భారత్ లో కూడా బోయింగ్ 737 రకం విమానాలపై డీజీసీఏ నిషేధం విధించింది. దీనితో ఆ రకం విమానాలు షెడ్లకే పరిమితం అయ్యాయి.
మనదేశంలో బోయింగ్ 737 రకం విమానాల సంఖ్య పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. జెట్ ఎయిర్ వేస్, ఇండిగో ఎయిర్ లైన్స్, స్పైస్ జెట్ సంస్థల వద్దే బోయింగ్ 737 విమానాలు ఉన్నాయి. ఇండిగో సంస్థ వద్ద బోయింగ్ విమానాలు ఉన్నప్పటికీ.. పైలెట్ల కొరత వల్ల వాటిని అందుబాటులోకి తీసుకుని రావడాన్ని మానేసింది. చాలాకాలం నుంచే ఇండిగో ఆ రకం విమానాలను వినియోగంలోకి తీసుకుని రావట్లేదు. స్పైస్ జెట్ వద్ద 12, జెట్ ఎయిర్ వేస్ వద్ద అయిదు బోయింగ్ విమానాలు ఉన్నాయి. ప్రస్తుతం డీజీసీఏ తీసుకున్న నిర్ణయం వల్ల ఆయా సంస్థల వద్ద ఉన్న బోయింగ్ విమానాలు గాల్లోకి ఎగరలేవు. షెడ్లకే పరిమితం చేయాల్సి ఉంటుంది.
సంస్థ ఆర్థిక కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని ఇండిగోతో పాటు జెట్ ఎయిర్ వేస్ కూడా ఇప్పటికే వందకు పైగా విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల మరో 80కి పైగా సర్వీసులకు మంగళం పాడక తప్పదని ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్ లిమిటెడ్ విశ్లేషకుడు సంతోష్ హిరే దేశాయ్ అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల వల్ల ఇండిగో సంస్థ యాజమాన్యం బాగా లబ్ది పొందగలుగుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. తక్కువ చార్జీలను వసూలు చేసే సంస్థగా పేరున్న ఇండిగో సంస్థ వచ్చే వేసవి సెలవుల్లో ప్రయాణికుల నిష్పత్తిలో 40 శాతం మేర పెరుగుదల ఉంటుందని అంటున్నారు.