కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- ఒరిజినల్స్ ఇవ్వాలంటూ..!!
ప్రధాని మోదీపై బీబీసీ చిత్రీకరించిన డాక్యుమెంటరీ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది. ఒరిజినల్ డాక్యుమెంట్లను సమర్పించాలని సూచించింది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ- గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడ చోటు చేసుకున్న అల్లర్లపై బీబీసీ చిత్రీకరించిన డాక్యుమెంటరీ ఇది. ఇండియా- ది మోదీ క్వశ్చన్ అనే టైటిల్ తో రూపుదిద్దుకున్న ఈ డాక్యుమెంటరీని దేశంలో ఎక్కడ కూడా దీన్ని ప్రదర్శించకూడదంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై..
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టానికి విరుద్ధంగా ఈ డాక్యుమెంటరీ ఉండటం వల్ల దీన్ని నిషేధించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. దీని తరువాత కూడా కేరళతో పాటు ఢిల్లీ యూనివర్శిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వంటి కొన్ని చోట్ల దీన్ని ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీని నిషేధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇవ్వాళ పలు పిటీషన్లు దాఖలయ్యాయి.
ఏకపక్ష నిర్ణయం అంటూ..
బీబీసీ చిత్రీకరించిన డాక్యుమెంట్ ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏకపక్ష నిర్ణయమని, రాజ్యాంగ విరుద్ధమంటూ పిటీషనర్లు పేర్కొన్నారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల కింద అత్యవసరంగా లిస్టింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ అడ్వొకేట్ ఎంఎల్ శర్మ ఈ పిటీషన్ వేశారు. ఆయనతో పాటు ప్రముఖ జర్నలిస్ట్ ఎన్ రామ్, సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, తృణమూల్ కాంగ్రెస్ లోక్ సభ సభ్యురాలు మహువా మొయిత్రా కూడా మరో పిటీషన్ వేశారు.
సుప్రీంలో విచారణ..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (2) కింద 2002 గుజరాత్ అలర్లకు సంబంధించిన వాస్తవాలు, నివేదికలను తెలుసుకోవాల్సిన హక్కు పౌరులకు ఉందని పిటీషనర్లు పేర్కొన్నారు. కిందటి వారమే ఈ పిటీషన్లన్నింటినీ విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. ఇవ్వాళ ఈ పిటీషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎంఎం సుంద్రేశ్ తో కూడిన ధర్మాసనం- విచారణ చేపట్టింది.
ఐటీ యాక్ట్..
ఎన్ రామ్, ప్రశాంత్ భూషణ్, మహువా మొయిత్ర తరఫున సీనియర్ అడ్వొకేట్ చందర్ ఉదయ్ సింగ్ తన వాదనలను వినిపించారు. బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడాన్ని తొలుత హైకోర్టులో ఎందుకు సవాల్ చేయలేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. దీనికి ఉదయ్ సింగ్ బదులిస్తూ- ఐటీ నిబంధనలను సవాల్ చేస్తూ హైకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్లంటినీ తమకు బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టు ఇదివరకు సూచించిందని గుర్తు చేశారు.
ఒరిజినల్ డాక్యుమెంట్స్..
ఐటీ చట్టంలోని కొన్ని నిబంధనలపై బోంబే, మద్రాస్ హైకోర్టులు ఇదివరకే స్టేను మంజూరు చేశాయని ఉదయం సింగ్ చెప్పారు. వాదోపవాదాలను ఆలకించిన తరువాత జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎంఎం సుంద్రేశ్ తో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఒరిజినల్ రికార్డులు సమర్పించాలని సూచించింది. తదుపరి విచారణను ఏప్రిల్ కు వాయిదా వేసింది.