అసెంబ్లీలో గోవధ నిషేధం బిల్లును ప్రవేశపెడతాం: ప్రభుత్వం
కర్నాటక: కర్నాటకలో బీజేపీ సర్కార్ వచ్చి నెలరోజులు కావొస్తోంది. యడ్యూరప్ప సర్కార్ కొత్త నిర్ణయాలతో ముందుకెళుతోంది. ఇందులో భాగంగా కర్నాటకలో గోమాంసం నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది యెడ్డీ సర్కార్. ఇందుకోసం బిల్లును తీసుకొచ్చేందుకు పావులు కదుపుతోంది. 2010లో గోవధపై బిల్లును తీసుకొచ్చింది కర్నాటక సర్కార్. అసెంబ్లీలో మండిలిలో ఈ బిల్లు పాస్ అయ్యింది. అయితే అప్పటి గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ దీనికి ఆమోదం తెలపలేదు. ఇక అప్పటి నుంచి బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది.
2013లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బిల్లును విత్డ్రా చేయాలని భావించారు. ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రం గోవధ నిషేధం పాక్షికంగా అమలవుతోంది. ఇది 1964వ చట్టాన్ని అనుసరిస్తోంది. పాలు ఇవ్వని గోవులను, వ్యాధితో బాధపడుతున్న గోవులను వధించేందుకు 1964నాటి చట్టం అనుమతిస్తోంది. అయితే 2010 బిల్లు ప్రకారం గోవులను అక్రమంగా రవాణా చేస్తే ఏడేళ్లు జైలు శిక్ష విధించబడుతుందని బిల్లులో చేర్చడం జరిగింది.
ఇక గత నెల 26వ తేదీన యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2010 నాటి బిల్లును తిరిగి ప్రవేశపెట్టాలని పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇక వీరంతా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుండటంతో ప్రభుత్వం గోవధపై నిషేధం విధించేందుకు బిల్లు తీసుకొస్తుందని మంత్రి సీటీ రవి తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో గోవధపై చట్టాలు ఎలా ఉన్నాయో స్టడీ చేసేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలోనే బిల్లును ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ఇలా చేయడం వల్ల తాము గోవధ చేయకూడదన్న మహాత్ముడి బాటలో నడుస్తామని మంత్రి రవి చెప్పారు.
2010లో ప్రవేశపెట్టిన బిల్లును మరింత బలోపేతం చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని గోసంరక్షణ ప్రకోష్తా కోరింది. అంతేకాదు ఈ సారి బీజేపీ మేనిఫెస్టోలో కూడా పెట్టామని యడ్యూరప్పకు గుర్తు చేశారు. ఒక దేశం ఒక జెండా విధానాన్ని బీజేపీ విశ్వసిస్తుందని... సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్నాటక జెండాను తీసుకొచ్చారని దాన్ని వెంటనే రద్దు చేయాలని యడ్యూరప్పను కోరారు. వివిధ సంస్కృతులను ప్రతిబింబించే జెండాలు ఉండొచ్చు కానీ... జాతీయ జెండా కాకుండా మరొక అధికారిక జెండా ఉండరాదని మంత్రి రవి తెలిపారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.