చైనా యాప్స్ పై నిషేధం..ఆ ఉత్తర్వులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
భారతదేశంలో చైనా యాప్స్ పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది అని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. భారతదేశంలో అనేక చైనీస్ సంస్థలకు ఆంక్షలు విధించింది అని, అలాగే చైనీస్ యాప్స్ పై నిషేధం విధించింది అని ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ పేరుమీద ఉత్తర్వులు ఇచ్చినట్టు ఒక వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక ఈ వార్తపై భారత ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
చైనా యాప్స్ , ప్రొడక్ట్స్ విషయంలో కేంద్ర సర్కార్ పై ఒత్తిడి
భారత్-చైనా సరిహద్దులో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న సంఘటనలు, సైనికుల మధ్య జరిగిన ఘర్షణ, 20 మంది భారత దేశ సైనికులు, ఒక కల్నల్ తో పాటుగా మృతి చెందడం భారతదేశ ప్రజల తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. ఇక దీంతో చైనా యాప్స్ ను నిషేధిద్దాం.. చైనా ఉత్పత్తులను బహిష్కరిద్దాం అంటూ సోషల్ మీడియాలో బాయ్ కట్ చైనా క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఇక ఇదే సమయంలో చైనాను ఆర్థికపరంగా దెబ్బతీయడం కోసం చైనా వస్తువులపై, అలాగే చైనా యాప్స్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి కొనసాగుతోంది.
ప్రభుత్వం చైనా యాప్స్ నిషేధించిన ఉత్తర్వులు .. సోషల్ మీడియాలో సర్క్యులేట్
ప్రభుత్వం కూడా చైనాను కట్టడి చేయడం కోసం ఏం చెయ్యాలి అన్నదానిపై తీవ్రంగా ఆలోచిస్తుంది. ఈ పరిస్థితులలో చైనా యాప్స్ ను భారత ప్రభుత్వం నిషేధించింది అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక ప్రభుత్వం నిషేధం విధించిన జాబితాలో, టిక్టాక్ విగో వీడియో, క్లబ్ఫ్యాక్టరీ, షీన్, క్లాష్ ఆఫ్ కింగ్స్ వంటి యాప్స్ ఉన్నట్టు పేర్కొంది. ఇక ఈ వార్తపై ఇండియన్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. చైనాకు చెందిన కొన్ని మొబైల్ యాప్స్ ను ప్రభుత్వం నిషేధించినట్లు, అలాగే వాటి పనితీరును పరిమితం చేయాలని టెక్ కంపెనీలకు సూచించినట్లుగా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఇక ఉత్తర్వులు ఫేక్ అని తేల్చి చెప్పారు.
సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఉత్తర్వులపై క్లారిటీ ఇచ్చిన పీఐబీ
టిక్ టాక్, హలో వంటి పలు యాప్ లను నిషేధిస్తున్నట్లుగా పేర్కొన్న ఉత్తర్వులు నకిలీ ఉత్తర్వులని పీఐబీ ట్వీట్ చేసింది. ప్రభుత్వ ఇప్పటివరకూ అలాంటి ఉత్తర్వులు విడుదల చేయలేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఉత్తర్వులపై క్లారిటీ ఇచ్చిన పీఐబీ ఫేక్ఉత్తర్వులలో పేర్కొన్నట్లుగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ లలో , గూగుల్ ప్లే స్టోర్ లో చైనీస్ యాప్ లపై ప్రభుత్వం నిషేధం విధించడం లేదని పేర్కొన్నారు.
Recommended Video
ఆ సూచనలు ప్రభుత్వం చెయ్యలేదన్న పీఐబీ
ఇక తాజాగా భారత దేశం చైనా ఉద్రిక్తతల నేపథ్యంలోనే చైనా ఉత్పత్తులపై, చైనీస్ యాప్స్ పై ఈ విధమైన ప్రచారం జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే గూగుల్ ప్లే స్టోర్ లో కానీ,ఆపిల్ స్టోర్ లో కానీ ఈ యాప్ లను తొలగించాలని ప్రభుత్వం ఎలాంటి సూచనలు చేయలేదని పేర్కొన్నారు. చాలా కాలం నుండి బ్యాన్ చైనా అని చాలా మంది అంటున్నా భారత దేశంలో ప్రజల జీవనంలో చైనా ప్రజలకు తెలీకుండానే భాగమయింది . ఇక ఈ సమయంలో బాయ్ కాట్ చైనా ప్రొడక్ట్స్ అనాలంటే ముందుగా దేశీయ ప్రొడక్ట్స్ వాటికి ప్రత్యామ్నాయంగా చెయ్యాల్సిన అవసరం ఉంది .