అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం... అక్టోబర్ 31 వరకు పొడగింపు...
అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 31 వరకు పొడగించింది. అయితే డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతించిన ఇంటర్నేషనల్ కార్గో విమానాలకు మాత్రం ఇది వర్తించదు. ఈ మేరకు బుధవారం(సెప్టెంబర్ 30) కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్లాక్ 5 మార్గదర్శకాలను జారీ చేసిన కొద్దిసేపటికే విమానయాన శాఖ నుంచి కూడా ప్రకటన వెలువడింది.
Recommended Video
తాజా ఉత్తర్వులపై డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ... పూర్తి స్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్దరణ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉందన్నారు. ఇప్పటికీ చాలా దేశాలు క్వారెంటైన్ జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నాయని... కాబట్టి అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్దరణకు మరికొంత కాలం పట్టవచ్చునని చెప్పారు.
చివరిసారిగా అగస్టు 26న అంతర్జాతీయ విమాన సర్వీసులపై విమానాయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30 వరకూ నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు అప్పటి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా ఉత్తర్వులతో దాన్ని మరో నెల రోజులకు పొడగించారు.
కరోనా వ్యాప్తితో మార్చి 23 నుంచి దేశంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించారు. అయితే విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు వందే భారత్ మిషన్తో విమాన సర్వీసులను నడుపుతున్న సంగతి తెలిసిందే.
ఇక తాజా అన్లాక్ 5 మార్గదర్శకాల్లో సినిమా హాళ్లు,మల్టిప్లెక్సులకు కేంద్రం సడలింపులనిచ్చింది. 50శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమా థియేటర్లు,మల్టిప్లెక్సుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే అక్టోబర్ 15 నుంచి కాలేజీలు,స్కూళ్లు కూడా రీఓపెన్ చేసుకోవచ్చునని... అయితే దానిపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది.