చానెళ్ల బ్యాన్పై ప్రెస్ కౌన్సిల్ సీరియస్: కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ: మీడియాపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ కౌన్సిల్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ఈ అంశంపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని కౌన్సిల్ ఏర్పాటు చేసింది. కమిటీలో కన్వీనర్గా సీనియర్ జర్నలిస్టు రాజీవ్ రంజన్, సభ్యులుగా కె.అమర్నాథ్, కృష్ణప్రసాద్ను ప్రెస్ కౌన్సిల్ నియమించింది.
పక్షం రోజుల్లోగా నివేదికను ఇవ్వాలని కమిటీకి ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. తెలంగాణ సీఎస్, డీజీపీ, జర్నలిస్టులతో కమిటీ భేటీకానుంది. తెలంగాణలో పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు సూచనలు ఇవ్వాలని ప్రెస్ కౌన్సిల్ ఆదేశించింది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానల్ ప్రసారాలను తెలంగాణలో నిఇపివేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రెస్ కౌన్సిల్ మీడియాను ఉద్దేశించి ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మరింత తీవ్రంగా పరిగణించింది. ఎంఎస్ఓలు తెలంగాణ ప్రభుత్వ ప్రొద్భలం మేరకే చానళ్ల ప్రసారాలను నిలిపివేశారని తమకు సమాచారం ఉందన్న ప్రెస్ కౌన్సిల్, ఏబీఎన్ తమ ప్రసారాలతో ఏ తప్పూ చేయలేదని కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాలను పునరుద్ధరించకపోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సమస్యలు తప్పవని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్, మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ హెచ్చరించిన విషయం తెలిసిందే. గురువారం ఓ చానల్ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మీడియాపై కేసీఆర్ వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. కేసీఆర్ తన భాషను మార్చుకోవాలని సూచించారు.