ఎస్ యూవీ కార్ల సేల్: సుప్రీం కోర్టు కొరడా
న్యూఢిల్లీ: కాలుష్య భూతం నుంచి దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని రక్షించడానికి తగిన చర్యలు తీసుకుంటామని సుప్రీం కోర్టు చెప్పింది. ఢిల్లీ నగరంలో లగ్జరీ డీజిల్ కార్ల అమ్మకాలపై సుప్రీం కోర్టు కొరడా ఝళిపించింది.
2000 సీసీ దాటిన డీజిల్ ఎస్ యూవీ వాహనాలు, కార్ల విక్రయాలపై 2016 మార్చి 31వ తేది వరకూ నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. డీజిల్ కార్ల విక్రయాలు నిలిపివేస్తే సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఢిల్లీ నగరంలోని అన్ని ఆర్ టీఓ కార్యాలయాల్లో కొత్త డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లు చేయ్యకూడదని ఇంతకు ముందే నేషనల్ గ్రీన్ ట్రిబునల్ (ఎన్ జీటీ) ఆదేశించిన విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త డీజిల్ వాహనాలు కొనుగోలు చెయ్యరాదని ఎన్ జీటీ సూచించింది.
డీజిల్ కార్ల విషయంలో సుప్రీం కోర్టు స్పందించింది. 2005 కంటే ముందుగా రిజిస్టర్ అయిన ట్రక్కులను ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా నిషేధించడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. దేశ రాజధానికి వచ్చే ట్రక్కుల మీద గ్రీన్ ట్యాక్స్ కూడా రెట్టింపు చేసింది.
సరి-భేసి సంఖ్యల కోడ్ ఆధారంగా ప్రతి రోజూ రోడ్ల మీదకు వచ్చే కార్ల సంఖ్య తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలిస్తుందని తాము అనుకోవట్లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
అయితే తాము సరి-భేసి ని అడ్డుకోమని, కావాలంటే కొనసాగించుకోవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. ఢిల్లీ నగరంలో ఉన్న మొత్తం కార్లలో 23 శాతం డీజిల్ కార్లు ఉన్నాయి. అత్యంత కలుషిత నగరంలో ఢిల్లీ చెడ్డ పేరు మూటకట్టుకునింది.