బ్లాక్ మెయిల్: టీవీ చానల్ యజమానితో సహ ఆరు మంది అందర్: భార్య పేరుతో!
బెంగళూరు: టీవీ చానల్ ప్రారంభించి రహస్యంగా వీడియోలు చిత్రీకరించి వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆరు మందిని బెంగళూరు నగరంలోని బనశంకరి పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. నిందితుల నుంచి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ప్రజాప్రతినిధి చానల్ యజమాని సంతోష్ తో సహ ఆరు మందిని పోలీసులు అరెస్టు చేశారు. బనశంకరిలోని పాపారెడ్డిపాళ్యలో సంతోష్ నివాసం ఉంటున్నాడు. గతంలో సంతోష్ ప్రజాప్రతినిధి అనే పత్రిక నిర్వహించేవాడు.
ప్రజాప్రతినిధి పత్రికను నిలిపివేసిన సంతోష్ 8 నెలల క్రితం అతని భార్య అశ్విని పేరు మీద ప్రజాప్రతినిధి అనే టీవీ చానల్ ప్రారంభించాడు. ప్రజాపత్రినిధి టీవీ చానల్ ను బెంగళూరు నగరంతో సహ రాష్ట్ర వ్యాప్తంగా ప్రసారం చెయ్యాలని సంతోష్ నిర్ణయించి స్నేహితులతో కలిసి మామూళ్లు వసూళ్లు చెయ్యాలని నిర్ణయించాడు.
బనశంకరికి చెందిన బట్టల వ్యాపారి అమిత్ అనే వ్యక్తిని బెందిరించి అక్రమంగా భారీ మొత్తంలో నగదు వసూలు చేశారు. తరువాత సంతోష్ తన స్నేహితులు అశోక్ కుమార్, నవీన్, రోహిత్, మహదేవ్ తదితరులతో కలిసి బనశంకరి, యలహంక తదితర ప్రాంతాల్లో బట్టల దుకాణాల్లో వీడియోలు చిత్రీకరించి వారిని బెదిరించి మోసం చేసి అక్రమంగా నగదు వసూలు చేశారు. బాధితుడు అమిత్ ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు పక్కాప్లాన్ తో నిందితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.