ఇది నూతన అధ్యాయం.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా బండారు దత్తాత్రేయ మనోగతం
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కొలువుదీరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయడం.. ఆ పదవి చేపట్టడం తన జీవితంలో మరిచిపోలేని రోజని.. ఇదో కొత్త అధ్యాయమని వ్యాఖ్యానించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని.. గవర్నర్ పదవికి వన్నె తెస్తానని తెలిపారు దత్తాత్రేయ. రాజకీయ నేతగా, ప్రజా ప్రతినిధిగా.. ప్రజా జీవితంలో అంకితభావంతో పనిచేశానని.. ఆ మేరకు పదవులు తనను వెతుక్కుంటూ వచ్చాయని చెప్పుకొచ్చారు. ఏనాడు కూడా తాను పదవుల కోసం వెంపర్లాడలేదని.. తన పనితనంతో పదవులు వాటంతట అవే వచ్చాయని గుర్తు చేశారు.
11/9.. కొండగట్టు ప్రమాదానికి ఏడాది.. పరిహారం ఏమైంది.. ఢిల్లీ నిపుణులు ఏం తేల్చారు..!
హిమాచల్ ప్రదేశ్ అభివృద్దికి తన వంతు తోడ్పాటును అందిస్తానని తెలిపారు దత్తాత్రేయ. గవర్నర్గా తన వంతు పాత్ర సమర్థవంతంగా పోషిస్తానని చెప్పారు. పర్యాటకంలో దక్షిణాది రాష్ట్రాలను అనుసంధానం చేసి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామన్నారు. అధికార, విపక్ష నేతలను కలుపుకుపోయి హిమాచల ప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తానని చెప్పారు. రాజకీయాలపై తానిప్పుడు ఏమి మాట్లాడబోనని.. రాజ్యాంగబద్ద పదవిలో కొలువుదీరినందున ఇకపై పాలిటిక్స్పై స్పందించబోనని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలతో పాటు కార్మిక వర్గాలకు న్యాయం చేసేలా ప్రయత్నిస్తానని వ్యాఖ్యానించారు.