సన్నిహితుడిని కోల్పోయా.. కళామతల్లి ముద్దుబిడ్డ, బాలు మృతిపై దత్తాత్రేయ సంతాపం
ఆ స్వరం మూగబోయింది. వేల పాటలు ఆలపించిన గొంతు ఆగిపోయింది. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకొన్న ఎస్వీ బాల సుబ్రహ్మణ్యం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఎస్పీబీతో తమకు ఉన్న అనుబంధాన్ని ప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు. బాలు మృతిపై హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
అత్యంత సన్నిహితుడిని కోల్పోయా..
బాలు తనకు అత్యంత సన్నిహితుడు అని దత్తాత్రేయ తెలిపారు. బాలు మరణం సంగీతప్రియులకు తీరని లోటని చెప్పారు. బాలు గొప్ప సంగీతకారుడు, ప్లేబ్యాక్ సింగర్, సంగీత దర్శకుడు, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, చిత్ర నిర్మాత అని దత్తాత్రేయ పేర్కొన్నారు. పదాల మాధుర్యాన్ని గమనించి బాలు చేసే ఉచ్చారణ.. పాటను మరింత చేరువ చేసిందన్నారు. బాలు కళామతల్లి ముద్దు బిడ్డ అని కీర్తించారు.
వందేమాతరం సెంటినరీ కమిటీకి సేవలు..
40 ఏళ్ళ సినీప్రస్థానంలో 11 బాషలలో 40 వేల పాటలు పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే అరుదైన రికార్డు సృష్టించాడని దత్తాత్రేయ చెప్పారు. భారతీయ సినిమాకు ఎనలేని కృషి చేసిన బాలుకి పలు నంది అవార్డులు, పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారని తెలిపారు. 2004లో ప్రారంభించిన వందేమాతరం సెంటినరీ కమిటీకి బాల సుబ్రహ్మణ్యం వైస్ ఛైర్మెన్ గా సేవలు అందించారని దత్తాత్రేయ గుర్తుచేశారు.
సంగారెడ్డి ప్రజలకు చూపించగలిగా..
ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంతాపం తెలిపారు. అతనితో ఉన్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో ఓ సారి శివరాత్రి సందర్భంగా సంగారెడ్డిలో బాలుతో కచేరి ఏర్పాటు చేశామన్నారు. బాలుతో కచేరి చేయించి.. సంగారెడ్డి ప్రజలకు నేరుగా చూపించగలిగానని తెలిపారు. సంగీతం అంటే అందరికి ప్రాణమేనని.. అందులో నేను ఒక్కడినినని పేర్కొన్నారు. భూమి మీద ప్రజలు ఉన్నంత వరకు బాలు పాటలను జనం మర్చిపోరన్నారు. ఈ తరం ఘంటసాలను చూడలేకపోయినా బాలసుబ్రమణ్యాన్ని చూడగలిగారు అని జగ్గారెడ్డి గుర్తుచేశారు.