షిర్డీ బంద్: మూతపడ్డ హోటళ్లు, దుకాణాలు: సాయినాథుడి ఆలయంపై పుకార్లు..నమ్మొద్దు..!
ముంబై: మహారాష్ట్రలోని పవిత్ర పుణ్యక్షేత్రం షిర్డీలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. షిర్డీ సాయినాథుడి జన్మస్థలంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యల పట్ల షిర్డీవాసులు భగ్గుమంటున్నారు. నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు. బంద్ను పాటిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచీ షిర్డీలో ఏ ఒక్క హోటల్ కూడా తెరచుకోలేదు. హోటళ్లు మూత పడ్డాయి. దుకాణాలను మూసివేసి స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నారు స్థానికులు.
రాజధాని గ్రామాల పర్యటనకు బాలయ్య డుమ్మా: చంద్రబాబు పిలిచినా.. సీన్లోకి రాని నటసింహం.. !
షిర్డీని కాదని..
కోట్లాదిమంది భక్తులు కొలిచే సాయిబాబా జన్మస్థలం షిర్డీ కాదంటూ ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పత్రిలో ఆయన జన్మించారని, ఆ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి వంద కోట్ల రూపాయలను మంజూరు చేస్తామంటూ ఆయన వెల్లడించారు. పర్బణీ జిల్లాలో ఉన్న ఈ పట్టణంలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యల పట్ల షిర్డీవాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నిరవధిక బంద్..
ఇందులో భాగంగా- వారు షిర్డీ బంద్కు పిలుపునిచ్చారు. నిరవధిక బంద్కు దిగారు. ఆదివారం తెల్లవారు జాము నుంచి బంద్ను పాటిస్తున్నారు. షిర్డీలో బంద్ ప్రభావం కనిపిస్తోంది. హోటళ్లు, దుకాణాలు మూత పడ్డాయి. వాహనాల సంచారం రోజువారీ కంటే తగ్గింది. ఆటోలు, సెవెన్ సీటర్ల రాకపోకలు తగ్గిపోయాయి. ఇతర ప్రైవేటు వాహనాలేవీ రోడ్ల మీద తిరగట్లేదు. చిన్న, చిన్న దుకాణాలు కూడా మూత పడ్డాయి.
ఇబ్బందులను ఎదుర్కొంటున్న భక్తులు..
బంద్ ప్రభావం భక్తులపై తీవ్రంగా పడింది. బంద్ ఫలితంగా దేశం నలుమూలల నుంచీ వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణ సాధనాలేవీ అందుబాటులో లేకపోవడం వల్ల ఎటూ కదల్లేకపోతున్నారు. కొన్ని ప్రైవేటు వాహనాల డ్రైవర్లు ముందుకొచ్చినప్పటికీ.. బంద్ను పాటిస్తున్న వాహనాల యజమానులు వారిని అడ్డుకుంటున్నారు. స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు బంద్ను విజయవంతం చేయడానికి తమవంతు కృషి చేస్తున్నారు.
యధాతథంగా ఆలయం
కాగా- సాయినాథుడి ఆలయంలో యథాప్రకారం పూజలు కొనసాగాయి. సాయిబాబాకు యధాతథంగా ప్రాతఃకాల పూజలను అర్చకులు నిర్వహించారు. భక్తుల దర్శనం కోసం ఆలయాన్ని తెరిచి ఉంచారు. బంద్ సందర్భంగా ఆలయాన్ని కూడా మూసివేస్తారంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి దీపక్ మధుకర్ ముగ్లికర్ తెలిపారు. సాయిబాబాను దర్శించడానికి భక్తులు రావచ్చని, ఆలయాన్ని మూసివేస్తారనే వార్తలను విశ్వసించవద్దని ట్రస్ట్ సభ్యుడు బీ వాక్ఛురే స్పష్టం చేశారు.