15న బంద్: బాబు ప్రభుత్వం డిస్మిస్కు డిమాండ్, హెరిటేజ్పై బాంబు
చెన్నై: చిత్తూరు జిల్లా శేషాచలం ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏప్రిల్ 15వ తేదీన తమిళ హక్కుల సంస్థ ఒకటి బంద్కు పిలుపునిచ్చింది. తమిళ కూలీలను ఎదురుకాల్పుల్లో చంపినందుకు నిరసనగా బంద్కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. సదరు తమిళ సంస్థకు చెందిన ఓ కార్యకర్త మాట్లాడుతూ.. కూలీలు తమ పైన రాళ్లు, ఆయుధాలతో దాడి చేసినందు వల్లే కాల్పులు జరిగాయని పోలీసులు చెబుతున్న మాట అంగీకరించేదిగా లేదన్నారు.
ఎన్కౌంటర్ చేయాల్సిందిగా ఆదేశించిన అధికారుల పైన కేసు బుక్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బందులో అందరు పాల్గొనాలని ఆయన కోరారు.
కాగా, వారం రోజుల క్రితం గత మంగళవారం ఉదయం శేషాచలం అడవుల్లో ఎన్కౌంటర్ జరగగా, 20 మంది తమిళవాసులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీని పైన వారం రోజులుగా తమిళనాడులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
సోమవారం నాడు చెన్నై శివార్లలోని ఆయనావరంలో చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ స్టోర్స్ పైన నాటుబాంబు విసిరారు. అయితే, ఎలాంటిప్రమాదం సంభవించలేదు. పోలీసులు దీనికి సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.