వ్యవసాయ బిల్లులు : సెప్టెంబర్ 25న బంద్... విపక్షాలతో కలిసి ఫైట్కు సిద్దమవుతున్న కాంగ్రెస్...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఇప్పటికే పలు రైతు సంఘాలు 'భారత్ బంద్'కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న జరగనున్న ఈ బంద్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్,విపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే ఏఐసీసీ నుంచి ప్రదేశ్ కమిటీలకు సూచనలు వెళ్లాయి. ముఖ్యంగా పంజాబ్,హర్యానా రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేసేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
రైతు చేతికి అధికారం: మద్దతు ధర కొనసాగింపు: వ్యవసాయ బిల్లులపై మోదీ హర్షం - ఆ ఎంపీలపై చర్యలు?
నిరసన కార్యక్రమాలపై ఇప్పటికైతే కాంగ్రెస్,విపక్ష పార్టీల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే పంజాబ్,హర్యానా రాష్ట్రాల్లోని రైతు సంఘాలు ఇప్పటికే నిరసనలను ఉధృతం చేశాయి. ఈ నేపథ్యంలో రైతులతో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కాంగ్రెస్ సిద్దమవుతోంది. ఈ క్రమంలో విపక్ష పార్టీలన్నీ ఏక తాటి పైకి వచ్చి కేంద్రానికి నిరసన తెలిపే అవకాశం ఉంది.
కేంద్రం తీసుకొచ్చిన రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) బిల్లు, నిత్యవసర సరకుల(సవరణ) బిల్లు,రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు-2020 బిల్లులు లోక్సభ,రాజ్యసభల్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. లోక్సభలో సులువుగా గట్టెక్కిన ఈ బిల్లులకు రాజ్యసభలో మాత్రం గట్టి సవాల్ ఎదురైంది. అయినప్పటికీ విపక్ష సభ్యుల ఆందోళన నడుమే మూజువాణి ఓటు ద్వారా బిల్లులు పాస్ అయినట్లు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు.
Recommended Video
అయితే ప్రజాస్వామిక విలువలను,సభా నియామాలను ఉల్లంఘించేలా హరివంశ్ సింగ్ నారాయణ్ వ్యవహరించారని ఆరోపిస్తూ దాదాపు 100 మంది ఎంపీల సంతకాలతో విపక్ష పార్టీలు హరివంశ్పై అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చాయి. సంతకాలు చేసిన పార్టీల్లో కాంగ్రెస్తో పాటు టీఎంసీ,ఎస్పీ,టీఆర్ఎస్,సీపీఐ,సీపీఎం,కాంగ్రెస్,ఆర్జేడీ,డీఎంకె,ఆమ్ ఆద్మీ తదితర పార్టీలు ఉన్నాయి.