తమిళనాడు బంద్ సక్సెస్: కుట్రలు జరుగుతున్నాయని.. మండిపడిన బీజేపీ !
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం బంద్ నిర్వహించారు. బంద్ ముసుగులో శాంతి భద్రతల విఘాతానికి కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ మండిపడింది.
చెన్నై: రైతులకు మద్దతుగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న బంద్ తో మంగళవారం జనజీవనం స్తంభించింది. దుకాణాలు, హోటళ్లు, థియేటర్లు మూతపడ్డాయి. సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. తిరుపూర్ లో నాలుగు లక్షల మంది గార్మెంట్స్ ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చి బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
లారీ, వ్యాన్లు, ఆటోలు, ప్రైవేట్ వాహనాల సంస్థలు తమిళనాడు రాష్ట్ర బంద్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. తమిళనాడు రాజధాని చెన్నైతో సహ పలు నగరాలు, పట్టణాల్లో బంద్ ప్రభావంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంద్ ముసుగులో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చెయ్యడానికి సిద్దం అయ్యారని, శాంతి భద్రతల విఘాతానికి కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ తీవ్రస్థాయిలో ఆరోపించింది.
అఖిలపక్షం పిలుపు
తమిళనాడు రైతులకు మద్దతుగా అఖిలపక్షం పిలుపునిచ్చిన బంద్ తో మంగళవారం అన్నిప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడ్డాయి. రాస్తారోకోలతో తమిళనాడులో ఆందోళన చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పార్టీలు వ్యతిరేకం
బీజేపీ, తమిళ మానిల కాంగ్రెస్, పీఎంకే పార్టీలు బంద్ కు దూరం అని ప్రకటించారు. అయితే ఎండీఎంకే మాత్రం తటస్థంగా వ్యవహరిస్తోంది. డీఎంకే, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే అనుబంధ రవాణా సంస్థలు బంద్ ప్రకటించడంతో కొంత శాతం ప్రభుత్వ బస్సుల సేవలు నిలిచిపోయాయి.
ఆ వాహనాలు పూర్తిగా బంద్
ఆటో, వ్యాన్, లారీ, ప్రైవేటు వాహనాల సంస్థలు బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఆ సేవలు మొత్తం ఆగిపోయాయి. అన్ని రకాలసేవల నిలుపుదలతో తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేసే విధంగా రైల్ రోకోలు నిర్వహించాలని ప్రతిపక్ష నాయకులు సిద్దం అయ్యారు.
బంద్ ముసుగులో కుట్రలు: బీజేపీ
తమిళనాడు రాష్ట్ర బంద్ ముసుగులో శాంతి భద్రతల విఘాతానికి కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ఆరోపించారు. అందుకే తాము బంద్ కు దూరంగా ఉన్నామని ఆమె ప్రకటించారు.
బస్సులు నడిపిస్తున్న ప్రభుత్వం
అన్ని రకాల వాహన సేవలు బంద్ అయిన సందర్బంగా తమిళనాడు ప్రభుత్వ బస్సులు నడిపించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. అన్నా కార్మిక సంఘం ద్వారా బస్సులు నడిపించడానికి ఆ రాష్ట్ర రవాణా శాఖా మంత్రి ఎంఆర్. విజయభాస్కర్ చర్యలు చేపట్టారు.
ప్రతాపం చూపిస్తే కఠిన చర్యలు
బస్సుల మీద ప్రతిపక్షాలు ప్రతాపం చూపించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖా మంత్రి ఎంఆర్. విజయభాస్కర్ హెచ్చరించారు. లక్షల మంది పోలీసులు విధుల్లో నిమగ్నం అయ్యారు. బంద్ ను అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఉలిక్కిపడిన పళనిసామి
బంద్ నేపథ్యంలో ప్రభుత్వం రైతులకు అండగా ఉందని చాటుకునేందుకు ముఖ్యమంత్రి పళనిసామి చర్యలు తీసుకున్నారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి పలువురు రైతులకు పంట భీమా నష్టపరిహారం పంపిణీ చేసి ఊపిరిపీల్చుకోవడానికి ప్రయత్నించారు.
రైలురోకోలను అడ్డుకోవడానికి
ఢిల్లీలో నిరసనకు విరామం ప్రకటించిన రైతు నాయకుడు అయ్యాకన్ను నేతృత్వంలోని వందమంది రైతులు చెన్నై బయలుదేరారు. చెన్నై సెంట్రల్, ఎగ్మూరు రైల్వే స్టేషన్లలో రైలురోకో నిర్వహించడానికి సిద్దం కావడంతో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.
డీఎంకే నాయకుడు స్టాలిన్ కోసం
తిరువారూర్ లో జరిగే నిరసనకు డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ నేతృత్వం వహించడానికి సిద్దం కావడంతో ఆ ప్రాంతంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎంకే నాయకులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది.