నడ్డాకు బండి సంజయ్ బర్త్ డే శుభాకాంక్షలు.!రాష్ట్ర వ్యవహారాలపై కాసేపు చర్చ.!
డిల్లీ/హైదరాబాద్ : తెలంగాణ రైతాంగం పరిస్తితి అల్లకల్లోలంగా ఉందన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్. ఢిల్లీలో బీజేపి జాతీయ అధ్యక్షుడు జయ ప్రకాష్ నడ్డా తో కాసేపు రాష్ట్ర వ్యవహారాల గురించి చర్చించుకున్నారు. అంతే కాకుండా గురువారం జేపీ నడ్డా జన్మదినం కావడంతో ఆయనతో కాసేపు సమావేశమయ్యారు తెలంగాణ బీజేపి ఎంపీలు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎంపీలు అరవింద్, సోయం బాబూరావు, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కె.బాలసుబ్రమణ్యంలతో కలిసి జేపీ నడ్డాను కలిసి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నడ్డాను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. మీ నాయకత్వంలో తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పార్టీ మరింతగా బలపడుతోందని, అనేక రాష్ట్రాల్లో పార్టీ విజయ తీరాలను అందిపుచ్చుకుంటోందపి బండి సంజయ్ తెలిపారు.
అంతే కాకుండా కష్టపడే మనస్తత్వం, మీ అంకిత భావం మా అందరికీ స్పూర్తిదాయకమన్నారు బండి సంజయ్. మీ నాయకత్వంలో పార్టీ మరిన్ని విజయాలను సాధించాలని, మీకు దీర్ఘాయువు, ఆరోగ్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాని బండి సంజయ్ పేర్కొన్నారు. అనంతరం జేపీ నడ్డాతో కాసేపు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, బీజేపీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చేస్తున్న ఉద్యమాలపై చర్చించారు.
ప్రధానంగా రైతాంగ అంశంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై జేపీ నడ్డా ఆరా తిసినట్టు తెలుస్తోంది. వరిధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో స్పష్టత ఇచ్చిందని, సీఎం చంద్రశేఖర్ రావు ఆ అంశాన్ని రైతాంగానికి చేరవేయడంలో జాప్యం చేసినందుకే గందరగోళం చెలరేగిందని నడ్డా, బండి సంజయ్ మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.