బెంగళూరు వ్యాపారి, ఫ్యామిలీ సూసైడ్లో కీలక మలుపు
విచారణలో మాదాపూర్కు చెందిన కెజి సురేష్ రెడ్డి బెదిరించిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలుస్తోంది. సురేష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఆయనతో పాటు ఓ అధికారిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.
బెంగళూరు పోలీసుల నుంచి సిసిఎస్ అధికారులు కేసు వివరాలు తెలుసుకున్నారు. ఇక్కడ పాత రికార్డులను పరిశీలించి కౌశిక్ సంబంధించి ఎటువంటి కేసులు లేవని తేల్చారు. అలాగే 'రెడ్డి' పేరు గల వారంతా బదిలీలపై వెళ్లిపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
కౌశిక్ను బెదిరించిన పోలీసు సైబరాబాద్లో పని చేస్తున్నారని గుర్తించారని సమాచారం. వివరాల మేరకు... కౌశిక్కు సురేష్ రెడ్డి అనే వ్యక్తితో వివాదాలు ఉన్నాయి. సురేష్ రెడ్డి మాదాపూర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతడు బెంగళూరులోనూ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాడు.
కౌశిక్ భూమికి పక్కనే సురేష్ రెడ్డికి భూమి ఉంది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి. తనకున్న పరిచయాలతో సురేష్ రెడ్డి... ఎస్ఐ రెడ్డిని రంగంలోకి దింపాడు. అతని ద్వారా బెదిరింపులకు దిగాడు. ఎస్ఐ రెడ్డి తెలివితేటలు ఉపయోగించి హైదరాబాద్ సిసిఎస్ పేరును ఉపయోగించి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీంతోనే అటు బెంగళూరు పోలీసులు, ఇటు సిసిఎస్ అధికారులు తికమకపడ్డారు. కౌశిక్ను బెదిరించిన పోలీసు అధికారి సైబరాబాద్లో పని చేస్తున్నాడని తేలడంతో ఆ కోణంలో విచారించి నిందితులను గుర్తించినట్లుగా తెలుస్తోంది.