ఓట్ల పండుగకు సెలవని సంబరపడుతున్నారా..! ఓటేయ్యకుంటే జీతం కట్
బెంగళూరు : ఎన్నికల వేళ పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో పోలింగ్ డే ను హాలిడే గా ప్రకటిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ కొన్నిచోట్ల సెలవు ఇచ్చినప్పటికీ ఓటింగ్ మాత్రం అంతంత మాత్రమే ఉంటోంది. దీనికి సవాలక్ష కారణాలు సమాధానంగా కనిపిస్తున్నాయి. అయితే పోలింగ్ నాడు ఐటీ సంస్థలు సెలవు ఇవ్వడం లేదనే అపవాదు కూడా ఉంది. అదలావుంటే బెంగళూరుకు చెందిన కొన్ని ఐటీ కంపెనీలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది.
నగరవాసులు ఓటుకు దూరం.!
ఎన్నికల్లో ఓటింగ్ శాతం చూసినట్లయితే నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా నమోదవుతోంది. అక్కడ ఉదయాన్నే ఓట్లు వేయడం, లేదంటే ఓటు వేసి తమ పనులు చక్కబెట్టుకోవడం చేస్తుంటారు. కానీ నగరాలకు వచ్చేసరికి పరిస్థితి వేరేలా ఉంటోంది. కొన్ని కంపెనీలు సెలవు ఇవ్వకపోవడం.. ఆఫీస్ సమయాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి బ్రేక్ ఇవ్వకపోవడం.. తదితర అంశాలు ఓటింగ్ శాతం తగ్గడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. అదలావుంటే ఇటీవలి ఎన్నికల్లో పోలింగ్ డే నాడు హాలిడే ప్రకటించాలంటూ ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయిస్ ప్రతినిధులు ఎన్నికల సంఘం అధికారులను కలిసి వినతిపత్రాలు ఇస్తున్నారు. ఆ మేరకు ఎన్నికలు జరిగే రోజు ఐటీ కంపెనీలు సెలవు ఇవ్వాల్సిందేనంటూ ఆదేశిస్తున్నారు.
ఓటు వేస్తేనే జీతం
ఐటీ కంపెనీలు సెలవు ఇస్తున్నప్పటికీ చాలామంది ఉద్యోగులు ఓటు వేయడం లేదని అంటున్నారు హెచ్ఆర్ నిపుణులు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం బాధ్యత అని.. ఈసీ ఆదేశాల మేరకు సెలవు ఇస్తున్నప్పటికీ నిరూపయోగం చేయడం బాధాకరమంటున్నారు. ఆ క్రమంలో బెంగళూరు కంపెనీలు తీసుకున్న నిర్ణయం చర్చానీయాంశంగా మారింది.
ఓటు వేయడానికి పోలింగ్ నాడు వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తే.. కొంతమంది ఉద్యోగులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారనేది హెచ్ఆర్ నిపుణుల మాట. అందుకే పోలింగ్ డే నాటి హాలిడే ను రెస్ట్ గా తీసుకోవడమో లేదంటే ఇంకో రకంగా వాడుకోవడమో కుదరదని అంటున్నారు. బెంగళూరులో ఈ నెల 18వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ రోజు సెలవు తీసుకునే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆదేశిస్తున్నారు. అంతేకాదు ఓటు వేసినట్లు ఆధారాలు కూడా సమర్పించాలని నిబంధన పెట్టాయి.
పోలింగ్ డే హాలీడే.. ఓటేస్తారుగా..!
పోలింగ్ నాడు సెలవు తీసుకుని ఓటు వేసే ఉద్యోగులకు మాత్రమే పెయిడ్ హాలిడే వర్తిస్తుందని ప్రకటించాయి. ఓటు వేయని ఉద్యోగులకు ఆ రోజు సెలవుదినంగా వర్తించబోదని స్పష్టం చేశాయి. అదలావుంటే ఓటు వినియోగంపై తమ సంస్థ ఉద్యోగులకు అవగాహన మేసేజ్ లు పంపించడం విశేషం. మొత్తానికి సెలవంటూ ఇంట్లో పడుకోవడమో లేదంటే ఎంజాయ్ చేయడమో చేస్తే పోలింగ్ డే హాలిడే జీతం పోతుంది. ఓటు వేసే బాధ్యత లేని పౌరులుగా సహచరుల ఎదుట పరువు పోతుంది. ఇవన్నీ తిప్పలెందుకు గానీ.. ఉదయం పూట ఎంచక్కా ఓటు వేసి ఆ తర్వాత తమకు ఇష్టమొచ్చినట్లు డే ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది.