జయలలిత మృతి: బెంగళూరు జైల్లో శశికళకు సమన్లు, ఇలా కుదరదు, చిన్నమ్మ!
బెంగళూరు/చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ చేస్తున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి ఏకసభ్య విచారణ కమిషన్ చిన్నమ్మ శశికళకు సమన్లు జారీ చేసింది.
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఈ మెయిల్ ద్వారా సమన్లు పంపించారు. విచారణకు సిద్దంగా ఉండాలని ఆర్ముగస్వామి విచారణ కమిషన్ శశికళకు సూచించింది.
ఈమెయిల్ ద్వారా శశికళకు సమన్లు జారీ అయ్యాయని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు దృవీకరించారు. అయితే తనకు ఈమెయిల్ ద్వారా సమన్లు జారీ చేశారని, నేరుగా వచ్చి సమన్లు జారీ చేస్తే విచారణకు అంగీకరిస్తానని శశికళ తనదైన శైలిలో ఆర్ముగస్వామి విచారణ కమిషన్ కు సమాధానం ఇచ్చారని జైళ్ల శాఖ అధికారులు చెప్పారు..
ఇదే సందర్బంలో గురువారం చిన్నమ్మ శశికళతో భేటీ అయిన టీటీవీ దినకరన్ శశికళ 2018 జనవరి చివరి వరకూ మౌనవ్రతం చేస్తారని చెప్పడం కొసమెరుపు. మొత్తం మీద అతి త్వరలో బెంగళూరు సెంట్రల్ జైల్లో శశికళను ఆర్ముగస్వామి విచారణ కమిషన్ విచారణ చేసే అవకాశం ఉందని సమాచారం.