మరో వార్త లేదా: రేప్ కేసుపై కర్ణాటక సిఎం చిరాకు
బెంగళూర్: పాఠశాలలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసుపై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చిరాకుపడ్డారు. ఈ వార్త తప్ప మరోటి లేదా అని ఆయన మీడియా ప్రతినిధులపై విసుక్కున్నారు. బెంగళూర్ అత్యాచార సంఘటనపై బెంగళూర్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి.
ఎక్కడ ఎప్పుడు ఓ చర్యలు అవసరమో ఆ చర్యలు తీసుకుంటామని, ఎక్కడైతే అవసరమో అక్కడ గూండా చట్టాన్ని ప్రయోగిస్తామని ఆయన చెప్పారు. కేసు నుంచి రాజకీయ ప్రయోజనం పొందడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.
కాంగ్రెసు నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి నగరంలో ఆందోళనను ఉధృతం చేసింది. మంగళవారం జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప, కర్ణాటక బిజెపి చీఫ్ ప్రహ్లాద్ జోషి, ఇతర బిజెపి నాయకులు పాల్గొన్నారు. నైతిక విద్యను నిర్బంధం చేస్తూ పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేయాలని యెడ్యూరప్ప కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కొత్త పోలీసు కమిషనర్ భేటీ
బెంగళూర్ పోలీసు కమిషనర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎంఎన్ రెడ్డి బాధితురాలి కుటుంబ సభ్యులను కలిశారు. పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరద్కార్పై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన స్థానంలో ఎంఎన్ రెడ్డిని బెంగళూర్ పోలీసు కమిషనర్గా నియమించింది.