బెంగళూర్ రేప్: హైదరాబాదీలపై ఫిర్యాదు, రెడ్డి అరెస్టు
ఈ పాఠశాలతో పాటు మరో మూడింటిని నడుపుతున్న గౌతం అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యదర్శి రెడ్డిపై విద్యాశాఖ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డిప్యూటీ డైరెక్టర్ హెచ్బి మంజునాథ్ ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రెడ్డిని అరెస్టు చేశారు.
నిబంధనలను ఉల్లంఘించి సిబిఎస్ఇ ఇంగ్లీష్ మీడియా స్కూల్ను ఆ సంస్థ నడుపుతోందని, తద్వారా ప్రజలను, తల్లిదండ్రులను, ప్రత్యేకంగా 900 మందికి పైగా పిల్లలను మోసం చేసిందని, దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ అనుమతి లేదని అధికార వర్గాలు చెప్పాయి.
సంబంధిత శాఖ అధికారులు పాఠశాలను తనిఖీ చేశారని, సొసైటీకి కన్నడ మాధ్యమంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నడపుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం నిరుడు మార్చి 25వ తేదీన అనుమతి ఇచ్చిందని, ఆ విషయం అప్పటి తనిఖీలో తేలిందని ఆ వర్గాలు చెప్పాయి. అయితే, పాఠశాల సిబిఎస్ఇ సిలబస్ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రీ నర్సరీ నుంచి ఏడో తరగతి వరకు నడుపుతోందని ఆ వర్గాలు ఆరోపించాయి.
విద్యాశాఖ నలుగురు వ్యక్తులపై ఫిర్యాదు చేసింది. వారంతా హైదరాబాదుకు చెందినవారే. ట్రస్టు అధ్యక్షురాలు కె. దుర్గ, ఉపాధ్యక్షురాలు వై. శిల్ప, ప్రధాన కార్యదర్శి కెఆర్కె రెడ్డి, సంయుక్త కార్యదర్శి సురేంద్రబాబులపై ఫిర్యాదు చేశారు. రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు మిగతా ముగ్గురికి సమన్లు జారీ చేశారు.