బెంగళూర్ రేప్: చిన్నారిపై దారుణం అటెండరే పనే, అరెస్ట్
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో సంచలనం సృష్టించిన మూడేళ్ల చిన్నారి పైన అత్యాచార ఘటన కేసును బెంగళూరు పోలీసులు చేధించారు. స్థానిక ఆర్చిడ్స్ అంతర్జాతీయ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న విద్యార్థిని పైన గుండణ్ణ అనే అటెండర్ అత్యాచారానికి పాల్పడినట్లు నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి శనివారం తెలిపారు.
జాలహళ్లిలోని జనతా కాలనీకి చెందిన గుండణ్ణను అరెస్టు చేసి అనంతరం వైద్య పరీక్షలకు తరలించారు. నిందితుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడని, అతని ఫోటోను చూసి బాలిక కూడా గుర్తించిందని, దీంతో గుండణ్ణను అరెస్టు చేశామని ఎంఎన్ రెడ్డి తెలిపారు. కేసు పురోగతి నేపథ్యంలో ఆ పాఠశాలను సోమవారం నుండి పునఃప్రారంభించేందుకు ఆటంకాలు తొలగినట్లయిందన్నారు.
కాగా, చిన్నారి పైన మంగళవారం అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. తర్వాత రోజు చిన్నారి జ్వరంతో కూడా బాధపడుతున్నట్లు అనిపించింది. మధ్యాహ్న భోజనం తర్వాత కాస్తా కూనుకు తీసి తల్లి బిడ్డ పక్కన కూర్చుని సున్నితంగా ఏం జరిగిందని ప్రశ్నించింది.
తనపై దారుణానికి పాల్పడిన వ్యక్తిని.. దుర్మార్గుడైన అంకుల్ అని చెప్పింది. శరీరంపై గాయాల గుర్తులు కనిపించాయి. ఆమె ప్రైవేట్ భాగాలపై కూడా గాయాలు కనిపించాయి. గురువారంనాడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమావేశం జరిగింది. బాలికను రోజంతా అబ్జర్వేషన్లో పెట్టామని టీచర్ చెప్పాడు. పదే పదే అదే మాట చెప్పింది.
అమ్మాయి రెండుసార్లు బయటకు వెళ్లిందని, రెండుసార్లు కూడా మహిళా కేర్ టేకర్ వెంట వెళ్లిందని చెప్పింది. అదంతా సిసిటీవీలో రికార్డయిందని కూడా వాదించింది. దీపావళి వేడకలు జరుగుతుండగా అమ్మాయి ఎటు వెళ్లిందని తల్లిదండ్రులు అడిగారు. అయితే, దానికి పాఠశాల యాజమాన్యం నుంచి సరైన సమాధానం రాలేదు.
తరగతి గదిలో గానీ ఆట స్థలంలో గానీ విద్యార్థులు ఉన్నారా, లేదా అనేది కూడా కచ్చితంగా చెప్పలేకపోయారు. ఇవన్నీ అమ్మాయిపై అత్యాచారం జరిగిందనే అనుమానాలకు తావిచ్చింది. తల్లిదండ్రులు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసినప్పుడు లైంగిక దాడి జరిగిందనే విషయం తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టి గుండణ్ణను అరెస్టు చేశారు.