తెహెల్కా ఫాల్: బంగారు లక్ష్మణ్, చంద్రబాబు హ్యాపీ
హైదరాబాద్: లైంగిక దాడి కేసును తెహెల్కా మాజీ ఎడిటర్ - ఇన్ - చీఫ్ తరుణ్ తేజ్పాల్ ఎదుర్కోవాల్సి రావడటం, తెహెల్కా సంక్షోభంలో పడడం కొంత మందికి ఆనందంగానే ఉండి ఉంటుంది. పలువురు రాజకీయ నాయకులపై తెహెల్కా తీవ్రమైన ఆరోపణలతో కూడిన వార్తాకథనలను ఇచ్చింది. దాంతో తెహెల్కాకు, తరుణ్ తేజ్పాల్కు శత్రువులు దండిగానే తయారయ్యారు. తరుణ్ తేజ్పాల్ తనపై లైంగిక దాడి కేసు పెట్టడాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించడానికి ఆ వార్తాకథనాలు పనికి వచ్చాయి.
తెహెల్కా కారణంగా ఆపరేషన్ వెస్ట్ ఎండ్ కారణంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగారు లక్ష్మణ్ బిజెపి జాతీయాధ్యక్ష పదవిని వదులుకోవాల్సి వచ్చింది. జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. తెహెల్కా స్టింగ్ ఆపరేషన్లో పట్టుబడిన బంగారు లక్ష్మణ్ కేసును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ కేసులో 2012లో బంగారు లక్ష్మణ్ దోషిగా తేలారు.
బంగారు లక్ష్మణ్ ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నారు. ఆయనకు ఆరోగ్య కారణాలతో బెయిల్ లభించింది. అయితే, ఆయన రాజకీయ జీవితం కూడా దెబ్బ తిన్నది. డిఫెన్స్ డీల్కు సంబంధించి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ బంగారు లక్ష్మణ్ వీడియోకు చిక్కారు. తరుణ్ తేజ్పాల్ పట్ల తనకు గల ఆగ్రహాన్ని బంగారు లక్ష్మణ్ ఏ మాత్రం దాచుకోలేదు.
తరుణ్ తేజ్పాల్ను, ఆశారాం బాపును ఒకే జైలులో పెట్టాలని, తరుణ్ తేజ్పాల్కు ఏ విధమైన అదనపు సౌకర్యాలు కల్పించకూడదని బంగారు లక్ష్మణ్ అన్నారు. ఎట్టకేలకు తరుణ్ తేజ్పాల్ నిజ స్వరూపం బయటపడడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. కాల్ గర్ల్స్ను కూడా స్టింగ్ కోసం తేజ్పాల్ వాడేవాడని ఆయన అన్నారు. నైతిక విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు తరుణ్ తేజ్పాల్కు లేదని, అతను సుదీర్ఘ కాలం జైలులో ఉండాలని తాను కోరుకుంటున్నానని బంగారు లక్ష్మణ్ అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ తెహెల్కా ఓ వార్తాకథనాన్ని ఇచ్చింది. చంద్రబాబు నాయుడు 2 వేల కోట్ల రూపాయలు సంపాదించారని, కుప్పం నియోజకవర్గంలోని తన భూములకు ప్రయోజనం కలిగే విధంగా చంద్రబాబు కుప్పం మైక్రో ఇర్రిగేషన్ ప్రాజెక్టును అమలు చేశారని ఆరోపిస్తూ తెహెల్కా అప్పట్లో ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. అప్పటి నుంచి ఆ వార్తాకథాన్ని చంద్రబాబుపై దాడికి కాంగ్రెసు ఆయుధంగా ఎంచుకుంది.