టీఎంసీ తరపున ఆదేశ నటుడు ప్రచారం... ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ
కోల్కతా: బంగ్లాదేశ్ ప్రముఖ నటుడు ఫిర్దౌస్ అహ్మద్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయలాల్ అగర్వాల్ తరపున ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది. రాణిగంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అగర్వాల్ కోసం ఫిర్దౌస్ ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో ఇద్దరు నటులు అంకుష్, పాయల్తో పాటుగా కరణ్దిగి నుంచి ఇస్లామ్పూర్ వరకు జరిగిన రోడ్షోలో అహ్మద్ పాల్గొని ప్రచారం నిర్వహించారు.
టీఎంసీకి మద్దతుగా ప్రచారంలో బంగ్లాదేశ్ స్టార్
బంగ్లాదేశ్ నటుడు ఫిర్దౌస్ అహ్మద్ టీఎంసీ తరపున ప్రచారం నిర్వహించారు. ముందుగా రోడ్ షోలో పాల్గొన్న అహ్మద్ ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. అంతా తృణమూల్ కాంగ్రెస్కు ఓటు వేయాలని అందరూ దీదీ కోసమే ఓటువేయాలని పిలుపునిచ్చారు.ఇదిలా ఉంటే రోడ్షోలో బంగ్లాదేశ్ నటుడు ఫిర్దౌస్ అహ్మద్ పాల్గొనడాన్ని తప్పుబడుతూ బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో ఒక విదేశీయుడు పాల్గొనడం అంటే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లే అని ఆరోపిస్తూ బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.
మైనార్టీ ఓట్ల కోసమే తృణమూల్ తాపత్రయం: బీజేపీ
మైనార్టీ ఓట్ల కోసమే అలాంటి నటులను తృణమూల్ కాంగ్రెస్ రంగంలోకి దింపిందని ఫిర్యాదు చేసింది బీజేపీ. బంగ్లాదేశీయులు అంటే తృణమూల్ కాంగ్రెస్కు ఎంత ప్రేమ ఉందో ఇక్కడే స్పష్టమవుతోందని అన్నారు బీజేపీ నేత ప్రతాప్ బెనర్జీ. అయితే బంగ్లాదేశ్ నుంచి నటుడిని పిలిపించుకుని ప్రచారం తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం నిర్వహించుకుంటున్నారనే ఫిర్యాదు తమకు అందిందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ నటుడితో ప్రచారం నిర్వహించుకుంటే తప్పేముందని తృణమూల్ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. 1971లో బంగ్లాదేశ్ విమోచన కోసం జరిగిన యుద్ధంలో భారత్ సహకరించిందనే విషయాన్ని మరువకూడదని తృణమూల్ కాంగ్రెస్ గుర్తుచేస్తోంది. ఫిర్దౌస్ అహ్మద్ తమకు మద్దతుగా వచ్చి ప్రచారం చేయడంలో తప్పులేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
శ్రీరామ నవవి రోజున కత్తులు తిప్పిన బీజేపీ నేతలపై కూడా చర్యలు తీసుకోవాలి
జాతికి వ్యతిరేకంగా తాము ఎలాంటి తప్పు చేయడం లేదని తృణమూల్ కాంగ్రెస్ సమర్థించుకుంది.ఎన్నికల నిబంధనను కూడా ఎక్కడా ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం తమపై చర్యలు తీసుకుంటే శ్రీరామ నవమి రోజున కత్తులు, ఇతర మారణాయుధాలతో ప్రదర్శన నిర్వహించన బీజేపీ నేతలపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తృణమూల్ కాంగ్రెస్ చెబుతోంది. ఎన్నికల నిబంధన అమల్లో ఉండగా కత్తులు, ఇతర మారణాయుధాలు వినియోగించరాదని కౌంటర్ ఇచ్చింది తృణమూల్ కాంగ్రెస్.