బిగ్ షాక్ : బంగ్లాదేశ్ కంటే వెనుకబడుతున్న భారత్... తలసరి జీడీపీ పతనం...
దేశంలో గత ఏడాది కాలంగా ఆర్థిక సంక్షోభం మొదలైందని చాలామంది పరిశీలకులు అభిప్రాయపడుతూ వస్తున్నారు. అయితే అది ఆర్థిక సంక్షోభం కాదని,మందగమనం మాత్రమేనన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఏకంగా 23.9శాతం మేర జీడీపీ పడిపోయింది. కరోనా వైరస్,లాక్ డౌన్ పరిస్థితులు జీడీపీపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ ఎఫెక్ట్ మున్ముందు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఎంతలా అంటే... ఆఖరికి తలసరి జీడీపీలో బంగ్లాదేశ్ కూడా భారత్ను అధిగమించేంతలా..
భారత్ను అధిగమించినున్న బంగ్లా..
ఈ ఆర్థిక సంవత్సరం భారత్ తలసరి జీడీపీ 10.3శాతం మేర తగ్గే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), వరల్డ్ ఎకనమిక్ అవుట్ లుక్ (డబ్ల్యూఈఓ) అంచనా వేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే మే 31,2021 నాటికి భారత్లో తలసరి జీడీపీ నాలుగేళ్ల కనిష్టస్ధాయికి చేరుకుని 1877 డాలర్లకు పడిపోతుందని అంచనా వేసింది. అదే సమయంలో బంగ్లాదేశ్ తలసరి జీడీపీ 4శాతం వృద్దితో 1888 డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది.
ఎందుకిలా జరిగింది...
నిజానికి తలసరి జీడీపీ విషయంలో కొన్నేళ్ల క్రితం వరకు బంగ్లాదేశ్ కంటే భారత్ చాలా ముందుంది. అయితే బంగ్లాదేశ్ ఎగుమతుల్లో వేగవంతమైన పెరుగుదల.. అదే సమయంలో భారత్ పొదుపు,పెట్టుబడులు ఒక మోస్తరుగానే ఉండటంతో ఇరు దేశాల జీడీపీ మధ్య వ్యత్యాసం తగ్గిపోయింది. ఐఎంఎఫ్ తాజా జీడీపీ అంచనాలను బట్టి చూస్తే పాకిస్తాన్,నేపాల్ లాంటి చిన్న ఆర్థిక వ్యవస్థల కంటే భారత్ కాస్త ముందుంటుంది. దక్షిణాసియాలో భూటాన్,శ్రీలంక,మాల్దీవులు,బంగ్లాదేశ్లు భారత్ను అధిగమించనున్నాయి.
తిరిగి పుంజుకుంటుందా..?
ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ పతనం 9.5శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేయగా... తాజా ఐఎంఎఫ్ అంచనాలు ఆ పతనం 10.3శాతం ఉంటుందని అంచనా వేయడం గమనార్హం. ఇటలీ,స్పెయిన్ తర్వాత ఇంత భారీ స్థాయిలో జీడీపీ పతనం చెందిన మూడో దేశం భారత్ కావడం గమనార్హం. అయితే ఇంత భారీ పతనాన్ని చవిచూసినా 2021లో భారత్ తిరిగి పుంజుకుంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2021లో భారత్ 8.8శాతం వృద్ది రేటుతో బంగ్లాదేశ్తో (5.4శాతం) పాటు చైనా(8.2శాతం)ను కూడా అధిగమిస్తుందని తెలిపింది. అప్పుడు భారత్ తలసరి జీడీపీ 2030 డాలర్లుగా బంగ్లాదేశ్ తలసరి జీడీపీ 1990 డాలర్లుగా ఉంటుందని పేర్కొంది.