ప్రియాంక గాంధీకి ఆ దేశ ప్రధాని ఆత్మీయ ఆలింగనం
న్యూఢిల్లీ: మనదేశ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆమె నివాసంలో ఈ ఉదయం భేటీ అయ్యారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఆనంద్ సింగ్, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి పెద్దగా రాజకీయ కారణాలేమీ లేవని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై చర్చించారని పేర్కొంది.
షేక్ హసీనా ప్రస్తుతం మనదేశంలో పర్యటిస్తున్నారు. నాలుగు రోజు అధికారిక పర్యటన కోసం ఆమె న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇదివరకే సమావేశం అయ్యారు. ఇద్దరూ కలిసి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. భారత ప్రధాని నరేంద్రమోడీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలు కలిసి మూడు ప్రాజెక్టులను ప్రారంభించారు. బంగ్లాదేశ్ నుంచి మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు ఎల్పీజీ గ్యాస్ సరఫరా సహా, నీటి వనరులు, యువజన వ్యవహారాలు, సంస్కృతి, విద్య, తీరప్రాంతాలపై నిఘా అంశాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చాయి.
ప్రభుత్వాధినేతలతో సమావేశాలు ముగిసిన అనంతరం షేక్ హసీనా సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. షేక్ హసీనా తొలిసారిగా బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నికైనప్పుడు మనదేశంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండేది. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ తన హయాంలో బంగ్లాదేశ్ ఆర్థిక బలోపేతానికి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఫలితంగా- షేక్ హసీనాకు వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఏర్పడింది. ఆ తరువాత యూపీఏ ఓడిపోయింది. షేక్ హసీనా నేతృత్వం వహిస్తున్న పార్టీ మాత్రం బంగ్లాదేశ్ లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ మాజీ పెద్దలతో ఉన్న అనుబంధం మేరకు ఆమె సోనియా గాంధీతో సమావేశమయ్యారని చెబుతున్నారు. ఈ ఉదయం ఆమె సోనియాగాంధీ నివాసానికి చేరుకున్నారు. ప్రియాంకా గాంధీ వాద్రా ఎదురెళ్లి ఆమెను సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా షేక్ హసీనా.. ప్రియాంకను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ ఫొటోను ప్రియాంక తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.